పబ్లిక్ ఇష్యూకు 20 కంపెనీలు రెడీ
ఫస్ట్ వేవ్ మాదిరిగా సెకండ్ వేవ్ స్టాక్ మార్కెట్ను ఏమాత్రం ప్రభావితం చేయలేకపోయాయి. నిజానికి ఇతర పెట్టుబడి సాధనాలు మార్కెట్లో లేకపోవడంతో సెకండ్ వేవ్ సమయంలో స్టాక్ మార్కెట్లోకి పెట్టుబడులు పెరిగాయి. లిక్విడిటీ భారీగా పెరగడంతో కంపెనీలు ఫలితాలు ఒక మోస్తరుగా ఉన్నా కొంటున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా క్యాపిటల్ మార్కెట్కు వస్తున్న షేర్లపై కూడా ఆసక్తి పెరుగుతోంది. గత ఏడాది అంటే 2020-21లో 69 కంపెనీలు స్టాక్ మార్కెట్లో ప్రవేశించి రూ. 75,000 కోట్లను సమీకరించాయి. దీంతో 2021-22లో భారీ పబ్లిక్ ఇష్యూలు రాన్నాయి. పేటీఎం, ఎల్ఐసీ ఇదే ఏడాది ఐపీఓలతో రానున్నాయి. ఏప్రిల్, మేనెలలో దాదాపు 20కిపైగా కంపెనీలు పబ్లిక్ ఆఫర్ కోసం ప్రాస్పెక్టస్లను దాఖలు చేశాయి. పబ్లిక్ ఆఫర్కు వస్తున్న కంపెనీల్లో ఫార్మా కంపెనీలు అధికంగా ఉన్నాయి. ఐపీఓకు క్యూ కడుతున్న కంపెనీలలో గ్లెన్మార్క్ లైఫ్ సైన్సస్, విండ్లాస్ బయోటెక్, సుప్రియా లైఫ్ సైన్సస్, జొమాటొ, దేవయాని ఇంటర్నేషనల్, ఆదిత్యా బిర్లా సన్ లైఫ్ ఏఎంసీ, గో ఎయిర్లైన్స్, జనా స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, కెమ్ప్లాస్ట్ సన్మార్, క్లీన్ సైన్స్ అండ్ టెక్నాలజీ కంపెనీలు ఉన్నాయి.