For Money

Business News

ఎన్‌డీటీవీ బోర్డులో ఇద్దరు అదానీ డైరెక్టర్లు

తమ కంపెనీలో 29.18 వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌ నుంచి ఇద్దరు డైరెక్టర్లను తీసుకోవాలని ఎన్‌డీటీవీ డైరెక్టర్ల బోర్డు నిర్ణయించింది. ఈ మేరకు ఇద్దరు పేర్లు సూచించాల్సిందిగా అదానీ గ్రూప్‌ కంపెనీ ఆర్‌ఆర్‌పీఆర్‌ హోల్డింగ్‌కు లేఖ రాసింది. ఈ విషయాన్ని కంపెనీ స్టాక్‌ ఎక్స్ఛేంజీలకు తెలిపింది. ఓపెన్‌ ఆఫర్‌ కింద అదానీ గ్రూప్‌ మరో 8.26 శాతం వాటాను కొనుగోలు చేసింది. అయితే ఈ విషయాన్ని ఎన్‌డీటీవీ బోర్డు పరిగణనలోకి తీసుకోలేదు. ఈనెల 9న సమావేశమైన బోర్డు అదానీ నుంచి ఇద్దరు డైరెక్టర్లను ఆహ్వానించింది. అక్కడి నుంచి పేర్లు వచ్చిన తరవాత ఈనెల 23న జరిగే తదుపరి సమావేవంలో తుది నిర్ణయం తీసుకుంటారు. నిజానికి అదానీ గ్రూప్‌నకు ఇపుడు 37.14 శాతం ఉండగా, ప్రణయ్‌ రాయ్‌ దంపతులకు 32.26 శాతం వాటా ఉంది. ఈ లెక్కన కంపెనీ ఛైర్మన్‌ పదవి అదానీ గ్రూప్‌కు ఇవ్వాల్సి ఉంది. అయితే ఓపెన్‌ ఆఫర్‌ వాటాను బోర్డు ఇంకా పరిగణనలోకి తీసుకోలేదు.