నిఫ్టి లాభాలు నిలబడుతాయా?
నిన్న మార్కెట్లు సెలవు. ఇవాళ సింగపూర్ నిఫ్టి వంద పాయింట్లకు పైగా లాభంతో ఉంది. నిఫ్టి స్థిరంగా లేదా స్వల్ప లాభాలతో ప్రారంభం కావొచ్చు. అయితే దేశంలో కరోనా పరిస్థితి మార్కెట్పై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది. ఒకవేళ లాభాలు వచ్చినా.. నిలబడటం కష్టమేనని అనలిస్టులు అంటున్నారు. ఏదో ఒక విధంగా దేశంలోని ప్రతి ప్రాంతంలో ఆంక్షలు ఉన్నాయి. దీని ప్రభావం జీడీపీపై ఉంటుందని అంతర్జాతీయ బ్రోకింగ్ సంస్థలు హెచ్చరిస్తున్నాయి. రాత్రి అమెరికా మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ముఖ్యంగా నాస్డాక్ ఒక శాతంపైగా లాభంతో ముగిసింది. ఇక ఆసియా మార్కెట్ల విషయానికొస్తే నిన్న రెండు శాతం పెరిగిన జపాన్ నిక్కీ, ఇవాళ రెండు శాతం నష్టంతో ట్రేడవుతోంది. నిన్న భారీగా క్షీణించిన హాంగ్సెంగ్ ఇవాళ నామ మాత్రపు లాభాలతో ట్రేడవుతోంది. నిన్న భారీ లాభాల్లో ట్రేడైన చైనా మార్కెట్లు ఇవాళ కూడా గ్రీన్లో ఉన్నాయి. అంతర్జాతీయ సెంటిమెంట్ ఇపుడు మన మార్కెట్లో ప్రభావం చూపడం కష్టమే. దేశీయ పరిస్థితులే మార్కెట్ దిశ, దశను నిర్ణయించనున్నాయి.