టెక్ దెబ్బకు నిఫ్టి విలవల
నిఫ్టి ఇపుడు కరెక్ట్గా కీలక స్థాయి 18450 ప్రాంతంలో ట్రేడవుతోంది. ఉదయం ఊహిచింనట్లే ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణ వైపు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టి క్రమంగా క్షీణిస్తూ కీలక మద్దతు స్థాయిని కోల్పోయింది. 18664 స్థాయి నుంచి నిఫ్టి 18454స్థాయికి చేరింది. అంటే 210 పాయింట్లు క్షీణించింది. ఇవాళ మార్కెట్ హెచ్సీఎల్ టెక్ ప్రకటన దారుణంగా దెబ్బతీసింది. హెచ్సీఎల్ టెక్ కంపెనీ ఈసారి గైడెన్స్ 13.5 శాతం నుంచి 14.50 శాతం ఉంటుందని ఇది వరకు ప్రకటించింది. ఇవాళ తమ గైడెన్స్లో దిగువ స్థాయి అయిన 13.5 శాతం సాధించే అవకాశాలు ఉన్నాయని.. కంపెనీ మార్జిన్స్పై ఒత్తిడి ఉందని పేర్కొనడంతో… మొత్తం ఐటీ షేర్ల సెంటిమెంట్ను దెబ్బతింది. నిజానికి ఐటీ కంపెనీల పనితీరుపై గతంలో కూడా అనుమానాలు రావడంతో… అమెరికాలో వరుసగా నాన్ స్టాప్గా నాస్డాక్ పడుతూ రావడంతో… ఐటీ షేర్లలో ఎవరూ గట్టి నమ్మకంతో లేరు. ఇపుడు హెచ్సీఎల్ ప్రకటనతో ఆ షేర్తోపాటు ఇతర షేర్లలో గట్టి అమ్మకాల ఒత్తిడి వచ్చింది. నిఫ్టితో పాటు నిఫ్టి నెక్ట్స్, నిఫ్టి మిడ్ క్యాప్ సూచీలను దెబ్బతీసిన షేర్లన్నీ ఐటీ కంపెనీలే. నిఫ్టిలో హెచ్సీఎల్ టెక్, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్ దెబ్బతీయగా… ఎంఫసిస్, ఎల్ అండ్ టీ మైండ్ట్రీ, నిఫ్టి మిడ్ క్యాప్ను పర్సిస్టెన్స్ దెబ్బతీశాయి. నిఫ్టి బ్యాంక్ తక్కువ నష్టంతో ఉన్నా… మిడ్ క్యాప్ బ్యాంకుల్లో అమ్మకాల ఒత్తిడి వస్తోంది.