For Money

Business News

డిసెంబర్‌కల్లా అదానీ చేతికి ఎన్‌డీటీవీ?

ఎన్‌డీటీవీలో 30 శాతం దాకా వాటా కొనుగోలు చేసిన అదానీ గ్రూప్‌… మరో 26 శాతం వాటా కోసం ఈనెల 17న ఓపెన్‌ ఆఫర్‌ ప్రారంభించనుంది. ఓపెన్‌ ఆఫర్‌ కింద వాటాదారులు తమ షేర్లను ఎంత వరకు విక్రయిస్తారో గాని… ఎన్‌డీటీవీ ప్రమోటర్‌ ప్రణయ్‌ రాయ్‌, ఆయన భార్య రాధికా రాయ్‌ మాత్రం … కంపెనీ నుంచి వైదొలగే అవకాశాలు కన్పిస్తున్నాయని ఢిల్లీ జర్నలిస్టులు అంటున్నారు. మరి వీరు అదానీతో డీల్‌ చేసుకుని తమ మిగిలిన వాటాను అమ్ముకుంటారా? లేదా బహిరంగ మార్కెట్‌లో అమ్ముతారా అన్నది తెలియలేదు. అయితే అదానీపై న్యాయ పోరాటం చేస్తే ప్రయోజనం లేదని ప్రణయ్‌ రాయ్‌ భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రణయ్‌ రాయ్‌ దాదాపు ఎన్‌డీటీవీ నుంచి వైదొలగడం ఖాయమని తెలియడంతో అదానీ నేతృత్వంలో పనిచేయడం ఇష్టం లేని ఛానల్‌ ఉద్యోగులు కంపెనీ నుంచి వైదొలగుతున్నారు. అదానీ ఎన్‌డీటీవీని టేకోవర్‌ చేయడంలో ప్రధాన ఉద్దేశం ప్రముఖ జర్నలిస్ట్‌ రవీష్‌ కుమార్‌ ‘ప్రైమ్‌ షో’ను ఆపేయడమని తెలుస్తోంది. అదానీ చేతికి ఎన్‌డీటీవీ వెళ్ళడం ఖాయమని గుర్తించిన రవీష్‌ ప్రకారం గత వారం సొంతంగా ‘రవీష్‌ కుమార్‌ అఫిషియల్‌’ పేరుతో సొంత యూట్యూబ్‌ ఛానల్‌ను ప్రారంభించారు. మరికొందరు ఎన్‌డీటీవీ నుంచి వైదొలగుతున్నట్లు సమాచారం.