3 నెలల నికర లాభం రూ. 4 లక్షల కోట్లు
కరోనా కాలంలో పెద్ద టెక్ కంపెనీలకు బాగా కలిసి వచ్చింది. యాపిల్, గూగుల్, మైక్రోసాఫ్ట్…ఈ మూడు కంపెనీలు కేవలం మూడు నెలల్లో 55 బిలయన్ డాలర్లు అంటే మన కరెన్సీలో రూ. 4 లక్ష లకోట్లకు పైగా నికర లాభం ఆర్జించాయి. అంటే ఖర్చులు, వడ్డీలు అన్నీ పోను మిగిలిన లాభం అన్నమాట. ఏప్రిల్ నుంచి జూన్ నెలాఖరులోగా ఈ కంపెనీలు రోజుకు రూ.4,500 కోట్లు చొప్పున నికర లాభం ఆర్జించాయన్నమాట. శని, ఆది, సెలవు రోజుల్లో కూడా. నిన్న రాత్రి ఈ మూడు కంపెనీలు తమ త్రైమాసిక ఫలితాలను ప్రకటించాయి. ఈ మూడింటిలో మూడు నెలలో 2,170 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించి యాపిల్ టాప్లో ఉంది. గూగుల్ (ఆల్ఫాబెట్) కూడా ఇదే కాలంలో 1,853 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది. ఇక మైక్రోసాఫ్ట్ కూడా 1,650 కోట్ల డాలర్ల నికర లాభం ఆర్జించింది ఆ మూడు నెలల్లో. ఏడాదిలో యాపిల్ నికర లాభం రెట్టింపు అయ్యింది. కాని గూగుల్ లాభం 300 శాతం పెరిగింది. అయితే మైక్రోసాఫ్ట్ నికర లాభం మాత్రం గత ఏడాదితో పోలిస్తే కేవలం 47 శాతం మాత్రమే పెరిగింది.
