For Money

Business News

ఇకపై ఢిల్లీలో హైదరాబాద్‌ బిర్యానీ

ఆన్​లైన్​ ఫుడ్​ డెలివరీ సంస్థ ‘ఇంటర్​సిటీ లెజెండ్స్’​ పేరుతో మరో కొత్త సర్వీసును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇప్పటివరకు మనం ఉన్న ప్రాంతంలో దొరికే ఆహార పదార్థాలను మాత్రమే ఆన్​లైన్​లో ఆర్డర్ చేసుకునే సౌకర్యం కల్పిస్తోంది జొమాటొ. ఇక నుంచి ఇతర నగరాల్లోని ప్రముఖ హోటల్స్‌ ఫుడ్‌ కూడా మీరు ఆర్డర్‌ చేయొచ్చు. ఇతర నగరాల నుంచి విమానాల ద్వారా ఈ ఫుడ్‌ను తెప్పిస్తామని జొమాటో సీఈఓ దీపిందర్​ గోయల్​ చెప్పారు. పైగా ఆధునిక టెక్నాలజీ వాడటం వల్ల ఆహారాన్ని ఫ్రీజ్‌ చేయడం కాని లేదా ప్రిజర్వేటివ్స్‌ను వాడటం కాని ఉండదన్నారు. డెలివరీ తరవాత ఆహారాన్ని వేడి చేసి కస్టమర్లు తినొచ్చిని ఆయన అన్నారు. ”కోల్​కతా నుంచి రసగుల్లా, హైదరాబాద్​ బిర్యానీ, బెంగళూరు నుంచి మైసూర్​ పాక్, లక్నో నుంచి కబాబ్, ఓల్డ్​ ఢిల్లీ నుంచి బటర్​ చికెన్, జైపూర్​ నుంచి ప్యాజ్​ కచోరీ వంటి వంటకాలను ఆర్డర్​ చేసుకోవచ్చని దీపిందర్​ గోయల్​ అన్నారు. అయితే ప్రస్తుతానికి ఈ సర్వీస్‌ను గుర్గావ్‌, దక్షిణ ఢిల్లీ ప్రాంతాలకు అందిస్తున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాంతాల్లోని కస్టమర్లు కోల్‌కతా, హైదరాబాద్,లక్నో, జైపూర్, బెంగళూరు, మథుర, చెన్నై, ఆగ్రా, భువనేశ్వర్​ వంటి నగరాల నుంచి ఫుడ్‌ను జొమాటో ద్వారా ఆర్డర్​ చేసుకోవచ్చని అన్నారు. ఆయా నగరాల్లో కేవలం ఎంపిక చేసిన రెస్టారెంట్ల నుంచి మాత్రమే సరఫరా చేస్తామన్నారు. త్వరలోనే ఇతర నగరాలకు ‘ఇంటర్​సిటీ లెజెండ్స్’ సర్వీస్‌ను విస్తరిస్తామని అన్నారు.