ఏపీలో రిలయన్స్ మెగా ప్రాజెక్ట్
ఆంధ్రప్రదేశ్కు మరో భారీ ప్రాజెక్టు రానుంది.రాష్ట్రంలో ఏకంగా రూ. 2.73 లక్షల కోట్లతో కోల్ గ్యాసిఫికేషన్ ప్రాజెక్టు చేపట్టాలని రిలయన్స్ ఇండస్ట్రీస్ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రప్రభుత్వానికి ప్రతిపాదన పంపింది. ఏలూరు జిల్లాలో లోని రేచర్ల, చింతలపూడి బ్లాక్స్లో ఏర్పాటు చేసేందుకు రిలయన్స్ ప్రతిపాదించింది. దాదాపు 30 ఏళ్ళ పాటు ఈ ఇంటిగ్రేటెడ్ అండర్గ్రౌండ్ ప్రాజెక్టు కొనసాగుతుందని, ఇందులో రూ. 2.7 లక్షల కోట్ల పెట్టుబడి పెడతామని రిలయన్స్ పేర్కొంది. 2030లోగా రూ. 1.2 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతున్నట్లు పేర్కొంది. ఆ తరవాత మరో రూ. 1.5 లక్షల కోట్ల పెట్టుబడి పెడుతారు. పైలెట్ ప్రాజెక్ట్ 2027 నాలుగో త్రైమాసానికి రెడీ అవుతుందని రిలయన్స్ పేర్కొంది. దీనివల్ల 5000 మందికి ప్రత్యక్ష ఉపాధి, గరిష్ఠంగా 35,000 మందికి పరోక్ష ఉపాధి అవకాశాలు ఏర్పడుతాయని వెల్లడించింది. అనకాపల్లి జిల్లాలో భారీ ఎత్తున బొగ్గు నిల్వలు ఉన్నట్లు ఇప్పటికే పరిశోధనల్లో తేలింది. 3000 ఎకరాల్లో విస్తరించి ఉన్న చింతలపూడి కోల్ బ్లాక్లో 90.49 కోట్ల టన్నులు బొగ్గు (G 12 Grade) ఉన్నట్లు తెలుస్తోంది. 5500 ఎకరాల్లో విస్తరించి ఉన్న రేచర్ల బ్లాక్లో ఏకంగా 222.56 కోట్ల టన్నులు బొగ్గు (G13 Grade) నిక్షేపాలు ఉన్నాయి. ఈ నిక్షేపాలు 600 మీటర్ల లోతులో ఉన్నట్లు పరిశోధనల్లో వెల్లడైంది.
