For Money

Business News

సింగర్‌ ఇండియాలో రాకేష్‌ పెట్టుబడి

కుట్టుమిషన్లు తయారు చేసే 170 ఏళ్ళ సింగర్‌ ఇండియాలో రాకేష్‌ ఝున్‌ఝున్‌వాలాకు చెందిన రేర్‌ ఎంటర్‌ప్రైజస్‌ 10 శాతం వాటా కొనుగోలు చేసింది. ఇవాళ ఉదయం ఈ డీల్‌ షేర్లు చేతులు మారాయి. రాకేష్‌ చివరి పెట్టుబడి నిర్ణయం ఇదేనని తెలుస్తోంది. ఈ డీల్‌ కుదిరిందని వార్తలు వచ్చిన వెంటనే ఈ కంపెనీ కౌంటర్‌లో భారీగా షేర్ల ట్రేడింగ్‌ జరిగింది. దాదాపు 20 శాతం ఈక్విటీ చేతులు మారింది. షేర్‌ ధర 20 శాతం పెరిగి అప్పర్‌ సీలింగ్‌లో ట్రేడవుతోంది. ఈ షేర్‌ బీఎస్‌ఈలోనే లిస్టయింది. ఈ షేర్‌ క్రితం ముగింపు రూ. 57.65. ఇవాళ ఉదయం రూ. 57.95 వద్ద ప్రారంభమైంది. రాకేష్‌ డీల్‌కు సంబంధించిన వార్త వచ్చిన మరుక్షణం నుంచే షేర్‌ ధర పెరగడం ప్రారంభమైంది. 10.15 గంటలకల్లా షేర్‌ 20 శాతం అప్పర్‌ సీలింగ్‌ను తాకింది. మొత్తం రూ. 82.05 కోట్ల విలువైన 1.47 కోట్ల షేర్లు ట్రేడయ్యాయి. ఈ ధర వద్ద ఇంకా దాదాపు 12 లక్షల షేర్లకు కొనుగోలుదారులు ఉన్నారు. కాని అమ్మకందారులు లేరు.