For Money

Business News

హైదరాబాద్‌లో రూ. 15000 కోట్ల డేటా సెంటర్‌

హైదరాబాద్‌లో రూ.15,000 కోట్లతో డేటా సెంటర్‌ను మైక్రోసాఫ్ట్‌ ఏర్పాటు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు మైక్రోసాఫ్ట్‌, తెలంగాణ ప్రభుత్వం డీల్‌ను ఖరారు చేసుకున్నట్లు బిజినెస్‌ స్టాండర్డ్‌ పత్రిక పేర్కొంది. నగర సమీపంలో డేటా సెంటర్‌ కోసం 50 ఎకరాల స్థలాన్ని ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలుస్తోంది. ఈ ప్రాజెక్టు ద్వారా 300 మంది నిపుణులకు ఉద్యోగాలు లభించగలవు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి త్వరలోనే ప్రకటన వెలువడే అవకాశముంది. 2020 చివర్లో హైదరాబాద్‌లో రెండో డేటా సెంటర్‌ రీజియన్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు అమెజాన్‌ వెబ్‌ సర్వీసెస్‌ (ఏడబ్ల్యూఎస్‌) ప్రకటించింది. ఇందుకోసం 277 కోట్ల డాలర్లు పెట్టుబడులు పెడుతున్నట్లు తెలిపింది. కంట్రోల్‌ ఎస్‌, ఫ్లిప్‌కార్ట్‌తో పాటు మరికొన్ని కంపెనీలు కూడా హైదరాబాద్‌లో డేటా కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాయి. 2016లోనే తెలంగాణ ప్రభుత్వం డేటా సెంటర్‌ పాలసీని విడుదల చేసింది. దేశంలో డేటా సెంటర్‌ పాలసీ కలిగిన కొద్ది రాష్ట్రాల్లో తెలంగాణ ఒకటి.