పసిడి రూ. 55,000, వెండి రూ. 70,000
చైనా మార్కెట్లు మళ్ళీ ప్రారంభం అయ్యే సరికి ప్రపంచ ఈక్విటీ, మెటల్ మార్కెట్లలో జోష్ కన్పిస్తోంది. కరోనా నిబంధనలను సడలిస్తున్నట్లు చైనా ప్రకటించగానే డాలర్ ఇండెక్స్ మళ్ళీ 104 దిగువకు వచ్చేసింది. చైనా మార్కెట్ ఓపెన్ కావడమంటే మెటల్స్కు డిమాండ్ పెరగడమే. అన్ని రకాల మెటల్స్తో పాటు బులియన్ కూడా పెరిగింది. ఎందుకంటే పారిశ్రామిక రంగంలో ఇటీవల వెండి వినియోగం బాగా పెరిగింది. వెండి, బంగారం రెండూ అమెరికా మార్కెట్లలో 1.5 శాతం మేర పెరిగాయి. చాలా రోజులు 1800 డాలర్ల ప్రాంతంలో ఉన్న ఔన్స్ బంగారం ధర ఇవాళ 1830 డాలర్లను దాటింది. వెండి కూడా 1.5 శాతం పెరిగింది. ఫలితంగా మన ఫార్వర్డ్ మార్కెట్లో కూడా బంగారం ధర పెరిగింది. ఎంసీఎక్స్లో పది గ్రాముల బంగారం ఫిబ్రవరి కాంట్రాక్ట్ ధర రూ.700లకు పైగా పెరిగి రూ. 55365ని తాకింది. ఇపుడు స్వల్పంగా తగ్గి రూ. 517 లాభంతో రూ. 55192 వద్ద ట్రేడవుతోంది. అదే కిలో వెండి మార్చి కాంట్రాక్ట్ ధర రూ.1200 పెరిగి రూ. 70335ని తాకింది. అక్కడి నుంచి స్వల్పంగా తగ్గి రూ. 69,895 వద్ద రూ.820 లాభంతో ట్రేడవుతోంది.