For Money

Business News

ఈవీ బ్యాటరీల ప్లాంట్‌పై రూ.7700 కోట్లు

విద్యుత్తు వాహనాల బ్యాటరీల ఉత్పత్తి కార్యకలాపాలపై వంద కోట్ల డాలర్ల (దాదాపు రూ .7,700 కోట్లు ) పెట్టుబడి పెట్టాలని అమర రాజా బ్యాటరీస్‌ వెల్లడించింది. వచ్చే ఆరుఉ నెలల్లో పైలెట్ ప్లాంట్ నిర్మాణాన్ని ప్రారంభిస్తామని అమరరాజా బ్యాటరీస్ ఛైర్మన్ జయదేవ్ గల్లా దావస్‌లో వెల్లడించారు. సీబీఎన్‌బీసీ టీవీ 18 ఛానల్‌తో ఆయన మాట్లాడుతూ… ముందుగా డిజైన్ల తయారు చేశాక… వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేస్తామన్నారు. విద్యుత్తు వాహనాల బ్యాటరీలకు సంబంధించి ఇప్పటికే ఐరోపాలోని ఒక స్టార్టప్‌లో పెట్టుబడులు పెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. మనదేశంలో విద్యుత్తు వాహనాల పరిశ్రమ ఇప్పుడిప్పుడే విస్తరిస్తోందని , ఇప్పటికే ద్విచక్ర- త్రిచక్ర వాహనాల విభాగంలో ఒక స్థాయిని అందుకున్నట్లు ఆయన తెలిపారు. కార్లు, బస్సుల విభాగాల్లో ఇబ్బందులను పరిశ్రమ త్వరలో అధిగమిస్తుందని అన్నారు. టాటా నెక్సాన్- ఈవీ విజయాన్ని ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం పెట్రోలు- డీజిల్ కారు కంటే విద్యుత్తు కారు ఖరీదు ఎక్కువగా ఉండటం.. పరిశ్రమ ఎదగడానికి ప్రధాన అవరోధంగా ఉందని అన్నారు. కొన్ని టూవీలర్‌ ఈవీల బ్యాటరీలు మండిపోవడంపై ఆయన మాట్లాడుతూ… ఆరంభంలో ఇలాంటి సమస్యలు సాధారణమని, త్వరలోనే వీటిని పరిష్కరించవచ్చని అన్నారు. ఇతర దేశాల్లోనూ ఈవీలు ప్రవేశపెట్టినపుడు ఇలాంటి అడ్డంకులు ఎదురైన అంశాన్ని ఆయన ప్రస్తావించారు.