ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేత?
పెరుగుతున్న ముడి చమురు ధరలను నియంత్రించే ప్రయత్నాలలో భాగంగా అమెరికా ఇరాన్ ముడి చమురుపై ఆంక్షలు త్వరలో ఎత్తివేస్తామని చెప్పింది.. ప్రస్తుతం నౌకలలో నిల్వ ఉన్న ఇరాన్ చమురును మార్కెట్లోకి ప్రవేశించడానికి అనుమతి ఇస్తామనిఅమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెసెంట్ తెలిపారు. ఫాక్స్ బిజినెస్ న్యూస్ ప్రొగ్రామ్లో మాట్లాడుతూ ఆయన ఈ ప్రకటన చేశారు. కతర్ గ్యాస్ క్షేత్రాలపై ఇరాన్ దాడితో ముడి చమురు ధరలు అనూహ్యంగా పెరిగాయి. ఒకదశలో బ్యారెల్ బ్రెంట్ ధర 119 డాలర్లను తాకింది. దీన్ని అదుపులో తేవడానికి నౌకల్లో ఉన్న ఇరాన్ చమురుపై ఆంక్షలు ఎత్తివేసింది. గతంలో ఇరాన్ చమురుపై అమెరికా ఆంక్షలు వేసింది. ఆంక్షల నేపథ్యంలో సుమారు 13 కోట్ల బ్యారెళ్ల ఇరాన్ చమురు నౌకల్లో ఉందని బెసెంట్ చెప్పారు. ఉద్రిక్తతలు కొనసాగుతున్నా గల్ఫ్ నుండి ఇరాన్ చమురు సరఫరా కొనసాగించడానికి అమెరికా అనుమతించిందని ఆయన తెలిపారు.
తన సౌత్ పార్స్ గ్యాస్ క్షేత్రంపై ఇజ్రాయెల్ దాడి చేసిన తర్వాత మధ్యప్రాచ్యంలోని వివిధ దేశాల ఇంధన స్థావరాలపై ఇరాన్ దాడి చేస్తోంది. ఇజ్రాయిల్ దాడి చేసినా… తాము మాత్రం ఇరాన్ ఇంధన మౌలిక సదుపాయాలపై దాడి చేయడం లేదని బెసెంట్ చెప్పారు.
