రెండేళ్ళు విద్యుత్ చార్జీలపై సీలింగ్
ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్లో ముఖ్యంగా బ్రిటన్లో ఇంధన చార్జీలు భారీగా పెరిగాయి. కరెంటు అవసరాలతో పాటు హీటింగ్ కోసం ఒక్కో ఇంటికి ఏడాదికి 3500 పౌన్లు కానుంది. వచ్చే నెల నుంచి పెరగనున్న చార్జీలతో ఏడాదికి ఒక్కో ఇంటికి ఇంధన బిల్లు 3500 పౌన్లు అవుతుందని అంచనా. అయితే ఒక్కో ఇంటికి ఇంధన చార్జీలను ఏడాదికి 2500 పౌన్లకు మాత్రమే పరిమితం చేస్తూ సీలింగ్ విధిస్తున్నట్లు బ్రిటన్ కొత్త ప్రధాని లిజ్ ట్రస్ పార్లమెంటుకు తెలిపారు. అంటే ఇంటి ఓనర్లు ఏడాదికి 2500 పౌన్లు చెల్లిస్తే చాలు. మిగిలినది ప్రభుత్వమే భరిస్తుంది. ఈ సీలింగ్ రెండేళ్ళకు ఉంటుందని ప్రధాని తెలిపారు. హాస్పిటల్స్కు, పబ్లిక్ సంస్థలకు మాత్రం ఈ సీలింగ్ ఆరు నెలలు మాత్రమే ఉంటుంది. దీనివల్ల ప్రభుత్వంపై ఎంత భారం పడుతుందో ప్రధాని చెప్పలేదు. అయితే 10,000 కోట్ల పౌన్ల వరకు భారం పడుతుందని అంచనా. ప్రభుత్వం భరించడమంటే.. బడ్జెట్ నిధులను ఖర్చు పెట్టడమేనని… అలా కాకుండా పెరిగిన ఇంధన ధర వల్ల భారీగా ఆయాచిత లబ్ది పొందుతున్న ఆయిల్ కంపెనీల లాభాలపై పన్ను పెంచాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. అయితే దీనికి ప్రధాని అంగీకరించలేదు.