భారీగా పెరిగిన రీటైల్ ధరల సూచీ
మార్చి నెలలో రీటైల్ ధరల సూచీ పరుగులు తీసింది. ఫిబ్రవరిలో 6.07 శాతం ఉన్న రీటైల్ ద్రవ్యోల్బణ సూచీ మార్చి నెలలో 6.95 శాతానికి చేరింది. ఆర్బీఐ అంచనాలకు మించి ద్రవ్యోల్బణం పెరగడం ఇది వరసగా మూడో సారి. రీటైల్ ద్రవ్యోల్బణం నాలుగు శాతం ఉంటుందని గత పరపతి విధానం సమీక్షలో ఆర్బీఐ తెలిపింది. అయితే రెండు శాతం అటు, ఇటూ ఉండొచ్చని పేర్కొంది. ఆర్బీఐ లెక్కలో గరిష్ఠ వైపు తీసుకున్నా ఆరు శాతం ఉండాలి. కాని ఆ అంచనాలను కూడా మించింది. ద్రవ్యోల్బణం పెరగడానికి ప్రధాన కారణంగా ఆహార వస్తువుల ధరలు భారీగా పెరగడమే. ఆహార వస్తువుల ధరలు ఫిబ్రవరిలో 5.85 శాతం పెరగ్గా, మార్చిలో 7.68 శాతం పెరిగాయి. కన్యూజమర్ ప్రైస్ ఇండెక్స్ (CPI) తమ అంచనాలను మంచి మార్చిలో 6.95 శాతానికి చేరిందని, ఇది 17 నెలల గరిష్ఠ స్థాయి అని రేటింగ్ సంస్థ ఇక్రా పేర్కొంది.