For Money

Business News

గుజరాత్‌లో టెస్లా ప్లాంట్‌?

ప్రతిష్టాత్మక కంపెనీలన్నీ ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌కు క్యూ కడుతున్నాయి. అంతర్జాతీయ ఈవీ కంపెనీ టెస్లా ప్లాంట్‌ కోసం తమిళనాడు, కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రయత్నం చేసింది. గుజరాత్‌, మహారాష్ట్ర కూడా పలు రాయితీలతో టెస్లా ప్లాంట్‌ను ఆకర్షించే ప్రయత్నం చేశాయి. అయితే గుజరాత్‌లో ప్లాంట్‌ పెట్టేందుకు టెస్లా అధినేత ఎలాన్‌ మస్క్‌ అంగీకరించినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. జనవరిలో జరిగే వైబ్రంట్‌ గుజరాత్‌లో ఎలాన్‌ మస్క్‌ కూడా పాల్గొంటారని, అపుడు కొత్త ప్లాంట్‌ గురించి ప్రకటన చేస్తారని అహ్మదాబాద్‌ మిర్రర్‌ పత్రిక పేర్కొంది. ప్రధాని మోడీ సమక్షంలో ఈ డీల్‌ కుదరనున్నట్లు ఆ పత్రిక పేర్కొంది. ఆరంభంలోనే 200 కోట్ల డాలర్లతో ప్లాంట్ పెడుతుందని… తరవాత ఈ పెట్టుబడిని 1500 కోట్ల డారల్లకు పెంచే అవకాశముందని బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. మూడు మోడల్స్‌ను టెస్లా భారత్‌లో ప్రవేశ పెట్టే అవకాశముంది. మోడల్‌ 3, మోడల్‌ వై, కొత్త హ్యాచ్‌బ్యాక్‌ కారును తేనుంది. హ్యాచ్‌బ్యాక్‌ కారు ధర రూ. 20 లక్షలు, మోడల్‌ వై ధర రూ. 36 లక్షలు, మోడల్‌ 3 కారు ధర రూ. 32 లక్షలు ఉండొచ్చని తెలుస్తోంది.