For Money

Business News

రివ్యూ పిటీషన్‌కు సుప్రీం ఓకే

టాటా సన్స్‌కు, తమ మధ్య నెలకొన్న వివాదంపై ఇది వరకు సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ షాపూర్‌జి పల్లోంజి గ్రూప్‌ సుప్రీం కోర్టులో రివ్యూ పిటీషన్‌ దాఖలు చేసింది. ఈ పిటీషన్‌ను బహిరంగ కోర్టులో విచారించేందుకు సుప్రీం కోర్టు అంగీకరించింది. జస్టిస్‌ ఎన్‌వి రమణ, జస్టిస్‌ ఏఎస్‌ బోపన్నలతో పాటు జస్టిస్‌ వి రామసుబ్రమణియన్‌లతో కూడిన బెంచ్‌ రివ్యూ పిటీషన్‌ను అనుమతించింది. అయితే జస్టిస్‌ రామ సుబ్రమణియన్ మాత్రం రివ్యూ పిటీషన్‌ విచారణ అర్హమైనది కాదని అసమ్మతి నోట్‌ రాశారు. త్రిసభ్య బెంచ్‌లో మెజారిటీ న్యాయమూర్తులు రివ్యూ పిటీషన్‌ వినేందుకు అంగీకరించారు. ఫిబ్రవరి 15వ తేదీన సుప్రీం కోర్టు ఈ రివ్యూ పిటీషన్‌కు అనుమతి ఇవ్వగా… తదుపరి విచారణ మార్చి 9వ తేదీకి వాయిదా వేసింది. ఏ కారణాలతో రివ్యూ చేయాలని పిటీషనర్‌ కోరారో.. అవి రివ్యూ పిటీషన్‌ విచారణ పరిధిలో లేవని జస్టిస్‌ రామ సుబ్రమణియన్‌ పేర్కొన్నారు. టాటా సన్స్‌కు, షాపూర్‌జి పల్లోంజి గ్రూప్‌ల మధ్య సాగిన కోర్టు కేసులో సుప్రీం కోర్టు టాటా సన్స్‌కు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై ఇపుడు షాపూర్‌జీ పల్లోంజి గ్రూప్‌ రివ్యూ పిటీషన్‌ వేసింది. షాపూర్‌జి పల్లోంజి గ్రూప్‌నకు చెందిన సైరస్‌ మిస్త్రీ కొన్నాళ్ళ పాటు టాటా సన్స్‌ ఛైర్మన్‌గా పనిచేసిన విషయం తెలిసిందే. ఆయనను తొలగించి… టీసీఎస్‌ మాజీ సీఈఓ ఎన్‌ చంద్రశేఖరన్‌ను టాటా సన్స్‌ నియమించింది. ఇది 2017లో జరిగింది. ఇపుడు చంద్రశేఖరన్‌ను రెండోసారి టాటా సన్స్‌ ఛైర్మన్‌గా ఎన్నుకుంది.