వావ్… చక్కెర లాభాలు భలే….
ఎల్నినో ఎఫెక్ట్ ఇపుడు క్రమంగా మార్కెట్లో కన్పిస్తోంది. పసిఫిక్ సముద్రంలో ఏర్పడిన ఎల్నినో ఎఫెక్ట్ పలు ప్రపంచ దేశాల్లో ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా భారత్తో పాటు యూరో మార్కెట్లలో కూడా వర్షాభావం ఉంది. ఇక చెరకు పండించే అనేక దేశాల్లో ఈసారి పంట ఆశించిన స్థాయిలో లేదు. దీంతో చాలా సంవత్సరాల తరవాత ప్రపంచ మార్కెట్లలో చక్కెర కొరత ఏర్పడుతోంది. దీంతో అన్ని దేశాల్లో చక్కెర నిల్వలపై నియంత్రణ ప్రారంభమైంది. మనదేశంలో కూడా కేంద్ర ప్రభుత్వం చక్కెర నిల్వల ఆంక్షలు తీవ్రం చేసింది. ఇప్పటి వరకు హోల్సేల్ వ్యాపారులకే పరిమితమైన ఆంక్షలు ఇపుడు సాధారణ డీలర్లకు కూడా వర్తింప జేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. 15 రోజులకు సరిపడా చక్కెర నిల్వలు ఉంచాలని, అంతకు మించి నిల్వ ఉంచరాదని ఆంక్షలు విధించింది. భారీ మొత్తంలో చక్కెర వినియోగించే వినియోగదారులపై కూడా ఇదే ఆంక్షలు విధించారు. దీంతో చక్కెర కొరత ప్రభావం మార్కెట్పై చూపుతోంది. చక్కెర కొరత కారణంగా ఈసారి కంపెనీల లాభాలు భారీగా పెరిగే ఛాన్స్ ఉంది. దీంతో ఇవాళ మార్కెట్లో దాదాపు అన్ని చక్కెర కంపెనీల షేర్లు పెరిగాయి. దాదాపు 20శాతం వరకు లాభాలు ఉండటం విశేషం. ఇవాళ బలరాంపూర్ చిని మిల్స్ షేర్ ఏకంగా 18 శాతం లాభంతో ముగిసింది. ఇక ద్వారకేష్ సుగర్ షేర్ కూడా 14 శాతం లాభపడింది. ఉత్తమ్ సుగర్ 10 శాతం, బజాజ్ హిందుస్థాన్ 10 శాతం లాభపడ్డాయి. ధరమ్పూర్ సుగర్ షేర్ 9 శాతం, శ్రీరేణుకా సుగర్స్, అవధ్ సుగర్స్, దాల్మియా భారత్ సుగర్స్ షేర్లు 7 శాతం చొప్పున పెరిగాయి. త్రివేణి ఇంజినీరింగ్, శింభోలి సుగర్స్, ఈఐడీ ప్యారీ షేర్లు కూడా 2 నుంచి 6 శాతం వరకు లాభాలతో ముగిశాయి.
