For Money

Business News

భారీ నష్టాలతో ముగిసిన నిఫ్టి

చివర్లో స్క్వేర్‌ ఆఫ్‌ సమయంలో నిఫ్టి కోలుకవడంతో నిఫ్టి 16985 వద్ద ముగిసింది. అంతకుముందు 2.45 గంటలకు నిఫ్టి ఇవాళ్టి కనిష్ఠ స్థాయి 16, 888ని తాకింది. అక్కడి నుంచి ఓ వంద పాయింట్లు కోలుకుంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 187 పాయింట్లు నష్టపోయింది. సెన్సెక్స్‌ 617 పాయింట్లు నష్టపోయి 56579 వద్ద ముగిసింది. బ్యాంక్‌ నిఫ్టి కోలుకుని అరశాతం లాభంతో క్లోజ్‌ కావడంతో నిఫ్టి నష్టాలు ఒక శాతానికి పరిమితమయ్యాయి. లేకుంటే భారీ నష్టాలతో ముగిసేది. నిఫ్టి మిడ్ క్యాప్‌ ఏకంగా రెండు శాతం నష్టపోగా, నిఫ్టి నెక్ట్స్‌ 50 షేర్‌ 1.76 శాతం నష్టంతో ముగిశాయి. చాలా రోజుల తరవాత హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ నిఫ్టి టాప్‌ గెయినర్స్‌లో వచ్చాయి. యాక్సిస్‌ బ్యాంక్‌ కూడా వచ్చింది. ఉదయం నుంచి గ్రీన్‌లో ఉన్న షేర్‌ ఐసీఐసీఐ బ్యాంక్‌. గత కొన్ని రోజులుగా టాప్‌ గెయినర్‌లో ఉన్న కోల్‌ ఇండియా ఇవాళ టాప్‌ లూజర్‌గా నిలిచింది. ఏకంగా 6.5 శాతం నష్టపోయింది. ఇక బీపీసీఎల్‌ ప్రైవేటీకరణకు బ్రేక్‌ పడటంతో ఆ షేర్‌ కూడా ఆరు శాతం తగ్గింది. మెటల్స్‌లో కూడా భారీ అమ్మకాల ఒత్తిడి వచ్చింది. అలాగే గతకొన్ని రోజులుగా పెరుగుతూ వచ్చిన నైకా ఏడు శాతం, జూబ్లియంట్‌ ఫుడ్‌ 5 శాతం నష్టపోయాయి.