For Money

Business News

17500పైన ముగిసిన నిఫ్టి

ఉదయం ఇవాళ్టి గరిష్ఠ స్థాయికి చేరిన నిఫ్టిపై యూరో మార్కెట్ల ప్రభావం తీవ్రంగా ఉంది. ఉదయం వీక్లీ సెటిల్‌మెంట్స్‌ కారణంగా వచ్చిన షార్ట్‌ కవరింగ్‌తో నిఫ్టి 17695ని తాకింది. ఆ తరవాత యూరో ఫ్యూచర్స్‌ నష్టాలతో నిఫ్టి క్రమంగా క్షీణించడం ప్రారంభించింది. మిడ్‌ సెషన్‌లో ప్రారంభమైన యూరో మార్కెట్లు ఒకటిన్నర శాతం వరకు నష్టపోవడంతో నిఫ్టి 17468 పాయింట్ల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. చివర్లో స్వల్పంగా కోలుకుని 17542 వద్ద ముగిసింది. క్రితం ముగింపుతో పోలిస్తే 216 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టిలో 38 షేర్లు నష్టాలతో ముగిశాయి. టాటా కన్జూమర్‌ ఇవాళ నిఫ్టిలో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. బజాజ్‌ ఫిన్‌ సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌ తరువాతి స్థానంలో ఉన్నాయి. ఇక నిఫ్టి లూజర్స్‌లో హిందాల్కో టాప్‌లో ఉంది. నిఫ్టిని దారుణంగా దెబ్బతీసిన షేర్లలో రిలయన్స్‌ ఉండటం విశేషం. దాదాపు మూడు శాతం క్షీణించింది రిలయన్స్‌. ఏజీఎం తరవాత మొన్న ఒక మోస్తరు లాభాలతో ఉన్న ఈ షేర్‌ ఇవాళ రూ.2564 వద్ద ముగిసింది. మరోవైపు అదానీ షేర్లు ఇవాళ కూడా పరుగులు తీశాయి. ఎన్‌డీటీవీ 5 శాతం అప్పర్‌ సీలింగ్‌తో ముగిసింది. నిఫ్టి బ్యాంక్‌ అర శాతం పైగా నష్టపోగా నిఫ్టి నెక్ట్స్‌, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ షేర్లు గ్రీన్‌లో ముగిశాయి. జొమాటొ షేర్‌ ఇవాళ ఏకంగా 8 శాతం పైగా పెరగడం విశేషం. అలాగే బజాజ్‌ హోల్డింగ్స్‌ కూడా ఆరు శాతం దాకా పెరిగింది. హైదరాబాద్‌కు చెందిన గ్లాండ్‌ ఫార్మా 5 శాతం పెరగడం విశేషం. భారీ విదేశీ ఆర్డర్‌ రావడంతో అశోక్‌ లేల్యాండ్‌ షేర్‌ 5 శాతంపైగా లాభపడింది. క్రూడ్‌ ధరలు తగ్గడంతో ఆస్ట్రాల్‌ కౌంటర్‌లో కూడా మంచి కొనుగోళ్ళ ఆసక్తి కనబడింది.