నిరాశపర్చిన కొటక్ బ్యాంక్
పెద్ద ప్రైవేట్ బ్యాంకుల్లో ఒకటైన కొటక్ మహీంద్రా బ్యాంక్ సెప్టెంబరు త్రైమాసికంలో రూ.2,032 కోట్ల నికర లాభాన్ని ప్రకటించింది. క్రితం ఆర్థిక సంవత్సరం ఇదే త్రైమాసికంలో బ్యాంక్ ఆర్జించిన లాభం రూ.2,184 కోట్లతో పోలిస్తే ఇది 7% తక్కువ. నిరర్థక ఆస్తుల కింద కేటాయింపులు అధికంగా ఉండటమే దీనికి కారణం. మొత్తం ఆదాయం మాత్రం రూ.8,252.71 కోట్ల నుంచి స్వల్పంగా పెరిగి రూ.8,408.87 కోట్లకు చేరింది. నికర వడ్డీ ఆదాయం రూ.3,897 కోట్ల నుంచి రూ.4,021 కోట్లకు చేరింది. నికర వడ్డీ మార్జిన్ 4.45 శాతంగా నమోదైంది. స్థూల నిరర్థక ఆస్తులు (ఎన్పీఏలు) 2.55 శాతం నుంచి 3.19 శాతానికి పెరిగాయి. అలాగే నికర ఎన్పీఏలు కూడా 0.64 శాతం నుంచి 1.06 శాతానికి చేరాయి. కేటాయింపులు రూ.333.22 కోట్ల నుంచి రూ.423.99 కోట్లకు చేరాయి. బ్యాంక్ కన్సాలిడేటెడ్ నికర లాభం రూ.2,947 కోట్ల నుంచి రూ.2,989 కోట్లకు స్వల్పంగా పెరిగింది. మొత్తం ఆదాయం రూ.13,548.33 కోట్ల నుంచి రూ.15,341.65 కోట్లకు చేరింది.