For Money

Business News

భారత్‌లో యాపిల్‌ ఆదాయం డబుల్‌

మార్చి-జూన్‌ మధ్య కాలంలో భారత్‌లో తమ కంపెనీ ఆదాయం రెట్టింపు అయినట్లు యాపిల్‌ కంపెనీ సీఈఓ టిమ్‌ కుక్‌ వెల్లడించారు. కంపెనీ నిన్న ప్రపంచ వ్యాప్త త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. సరఫరా వ్యవస్థలో ఇబ్బందులు, రష్యా, ఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు విడిపరికరాలకు సంబంధించి పలు సవాళ్ళు ఎదురైనా కంపెనీ ప్రోత్సాహకర ఫలితాలు సాధించిందని ఆయన అన్నారు.
అమెరికా, ఐరోపా, ఇతర ఆసియా-పసిఫిక్‌ ప్రాంతాల్లో తమ కంపెనీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదైందని టిమ్‌ కుక్‌ వివరించారు. భారత్‌తో పాటు బ్రెజిల్‌, ఇండోనేషియా, వియత్నాం దేశాల్లో ఆదాయం రెట్టింపు అయినట్లు ఆయన వెల్లడించారు. అమ్మకాలు తక్కువగా ఉన్న దేశాలపై కంపెనీ ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్లు ఆయన చెప్పారు. వివిధ కంపెనీలు యాపిల్‌ ఉత్పత్తుల కొనుగోలుపై పెట్టుబడులను పెంచుతున్నాయని తెలిపారు. అందుకు విప్రోను ఆయన ఉదాహరణగా పేర్కొన్నారు. కొత్త ఉద్యోగులను ఆకర్షించడానికి దీన్ని వారొక వ్యూహంగా వాడుకుంటున్నారని టిమ్‌ కుక్‌ వివరించారు.