శరత్చంద్రారెడ్డి భార్య కీలక పాత్ర?
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కీలక మలుపులు తిరుగుతోంది. ఈ స్కామ్లో ఇప్పటికే అరబిందో ఫార్మా డైరెక్టర్, ట్రైడెంట్ కెన్ఫర్ ప్రమోటర్ అయిన శరత్ చంద్రారెడ్డిని ఈడీ అధికారులు అరెస్ట్ చేశారు. ఈకేసులో రూ.100 కోట్లు శరత్ చంద్రారెడ్డి ఇతరులకు ఇచ్చినట్లు ఈడీ వెల్లడించింది. ఈ డబ్బుల బదిలీకి సంబంధించి మరిన్ని వివరాలు ఇవాళ వెల్లడి అయ్యాయి. బేగంపేట ఎయిర్పోర్ట్ కేంద్రంగా నగదు బదిలీ అయినట్లు మీడియాలో వార్తలు వస్తున్నాయి. ప్రైవేట్ జెట్ విమానాల ద్వారా నగదు తరలించినట్లుగా అనుమానిస్తున్నారు. శరత్చంద్రా రెడ్డి భార్య కనికా రెడ్డి నడుపుతున్న కానిక టెక్నివాల్ సంస్థ ద్వారా లావాదేవీలు జరిగినట్లు సమాచారం. జెట్సెట్ గో సంస్థ ద్వారా డబ్బులు బదిలీ అయినట్లు ఈడీ అధికారులు అనుమానిస్తున్నారు. ఈ కంపెనీకి శరత్ చంద్రా రెడ్డి భార్య సీఈఓగా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించిన వివరాలను ఎయిర్పోర్ట్ డైరెక్టర్ నుంచి ఈడీ కోరింది. ఈ మేరకు ఈడీ అధికారులు లేఖ రాశారు. ఈ విమానాలలో ప్రయాణించిన వారి డేటాను సేకరిస్తోంది.