For Money

Business News

సంక్షోభం సమయంలో బైజూస్‌ కీలక నిర్ణయం

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన ఎడుటెక్‌ సంస్థ బైజూస్‌ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటుంటోంది. రుణదాతల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా… కొన్ని రుణాల రీ షెడ్యూల్‌కు ప్రయత్నాలు చేస్తోంది. కొన్ని రుణాలు తిరిగి చెల్లించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. రుణదాతల్లో విశ్వాసం కల్పించడానికి.. చివరికి తాను ఇపుడు ఉంటున్న ఆఫీసును కూడా తరలించేందుకు సిద్ధపడింది. వ్యయ నియంత్రణ చర్యల్లో ఈ నిర్ణయం తీసుకున్నట్లు బైజూస్‌ ప్రకటించింది. ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను తొలగించిన ఈ సంస్థ.. తాజాగా బెంగళూరులోని భారీ ఆఫీసులను ఖాళీ చేస్తోంది. బైజూస్‌ ప్రధాన కార్యాలయం బెంగళూరులో ఉంది. ఇక్కడ కంపెనీకి మూడు పెద్ద ఆఫీసులు ఉన్నాయి. కల్యాణి టెక్‌ పార్క్‌లో మగ్నోలియా, ఎబోనీ అనే రెండు బిల్డింగ్‌లను బైజూస్ గతంలో లీజుకు తీసుకుంది. ఇందులో మగ్నోలియా బిల్డింగ్‌ మొత్తాన్ని గత నెలలోనే ఖాళీ చేయగా… అదే టెక్‌ పార్క్‌లో ఉన్న ఎబోనీ బిల్డింగ్‌ ఖాళీ చేస్తోంది. ఆగస్టు కల్లా మొత్తం ఆఫీసు ఖాళీ చేసే అవకాశం ఉంది. అలాగే ప్రెస్టీజ్‌ పార్కులోనూ కొంత భాగాన్ని ఖాళీ చేసినట్లు తెలిసింది. మున్ముందు కంపెనీలో పలు మార్పులు ఉంటాయని మీడియాలో కథనాలు వస్తున్నాయి.