అఖండ-2కు కోర్టు బ్రేక్
సీనియర్ నటుడు బాలకృష్ణ నటించిన అఖండ-2 సినిమా విడుదల వాయిదా పడింది. ఈ సినిమా విడుదలను ఆపేయాల్సిందిగా ఈ సినిమా నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కంపెనీని నిన్న మద్రాస్ హైకోర్టు ఆదేశిచింది. సుమారు రూ. 28 కోట్ల బకాయికి సంబంధించి 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్కు, ముంబైకు చెందిన హిందీ సినిమా నిర్మాణ సంస్థ ఎరోస్ ఇంటర్నేషనల్ మీడియా సంస్థ కేసు వేసింది. ఈ కేసు ఆర్బిట్రేషన్ ట్రైబ్యూనల్లో నడిచింది. ఎరోస్కు అనుకూలంగా ట్రైబ్యూనల్ తీర్పు ఇచ్చింది. అయినా 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ బకాయి చెల్లించలేదు. దీంతో ఎరోస్ కంపెనీ మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. కేసు వివరాలను విచారించిన జస్టిస్ ఎస్ఎం సుబ్రమణియం, జస్టిస్ సి కుమారప్పన్లతో కూడిన ధర్మాసనం అఖండ-2 సినిమా విడుదలను ఆపాలంటూ ఆదేశాలు జారీ చేసింది. సినిమా విడుదల చేయడమంటే ట్రైబ్యూనల్ ఆదేశాలను 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ ఉల్లంఘించడమేనని కోర్టు అభిప్రాయపడింది. తదుపరి ఉత్తర్వులు వెలువడే వరకు సినిమా విడుదలను ఆపేసింది. దీంతో సినిమా విడుదలను వాయిదా వేస్తున్నట్లు 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిన్న ప్రకటించింది.
