కనీస రీచార్జి ప్లాన్ ధర 57 శాతం పెంపు
వోడాఫోన్ను సర్వనాశం చేసిన తరవత ఇపుడు టెలికాం రంగాన్ని రిలయన్స్ జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఏలుతున్నాయి. తాజాగా ఎయిల్ టెల్ కంపెనీ హర్యానా, ఒడిశా రాష్ట్రాల్లో 28 రోజుల కనీస రీచార్జి ప్లాన్ ధరను 57 శాతం పెంచినట్లు బిజినెస్ స్టాండర్డ్ పత్రిక వెల్లడించింది. ఇప్పటి వరకు ఎయిర్టెల్లో 28 రోజుల కనీస రీచార్జి ప్లాన్ ధర రూ. 99 ఉండేది. దీన్ని ఏకంగా 57 శాతం పెంచి రూ. 155 చేసినట్లు ఆ పత్రిక పేర్కొంది. ఇప్పటి వరకు ఈ ప్యాక్ కింద 200ఎంబీ మొబైల్ డేటా, వాయిస్ కాల్ సెకనుకు 2.5 సెకన్లు చొప్పున ఆఫర్ చేసేది. ఇపుడు ఈ ప్యాకేజీని తొలగించి రూ. 155 ప్లాన్ను ఈ రెండు రాష్ట్రల్లో ప్రవేశపెట్టింది. దీని కింద అన్ లిమిటెడ్ కాలింగ్, 1 జీబీ డేటాతో పాటు 300 ఎంఎంఎస్లు ఇస్తున్నారు. అదనపు డేటా, సర్వీస్ ఇస్తున్నా… ఇవేవీ అక్కర్లేని వారు రూ. 99 ప్యాక్ను తీసుకునేవారు. ఇపుడు ఏకంగా ఆ ప్యాక్ను ఎత్తేయడంతో .. కనీస రీచార్జి కోసం ఇక నుంచి రూ. 155 కట్టాల్సి ఉంటుంది. గతంలో ఇదే కంపెనీలో కనీస ప్యాక్ రూ. 79 ఉండేది. తరవాత దాన్ని తొలగించి కనీస ప్యాక్ రూ. 99 చేశారు. ఇపుడు దీన్ని కూడా ఎత్తేసి కనీస ప్యాక్ రూ.155 చేస్తోంది కంపెనీ. ఇతర రాష్ట్రాల్లో కూడా రీచార్జి ప్లాన్లను మారుస్తుందేమో చూడాలి.