For Money

Business News

సీమలో 2 పారిశ్రామిక స్మార్ట్‌ సిటీలు

ఆంధ్రప్రదేశ్‌లో రెండు పారిశ్రామిక స్మార్ట్ సిటీలను అభివృద్ధి చేయాలని కేంద్ర కేబినెట్‌ నిర్ణయించింది. ప్రధాని మోడీ నేతృత్వంలో ఇవాళ జరిగిన కేబినెట్‌ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 12 కొత్త స్మార్ట్‌ సిటీలు అభివృద్ధి చేయాలని నిర్ణయించారు. దీనివల్ల 10 లక్షల మంది ఉద్యోగాలు లభిస్తాయని కేంద్రమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ వెల్లడించారు. కేబినెట్‌ నిర్ణయాలను ఆయన మీడియాకు వివరించారు. కొత్త పారిశ్రామిక స్మార్ట్‌ సిటీల నిర్మాణానికి రూ.28,602 కోట్ల పెట్టుబడి అవసరం అవుతుందని అంచనా వేసినట్లు ఆయన వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఓర్వకల్లుతో పాటు కొప్పర్తిలో పారిశ్రామిక స్మార్ట్‌ సిటీలను అభివృద్ధి చేస్తారు. అలాగే తెలంగాణలోని జహీరాబాద్‌లో కూడా ఇలాంటి సిటీని అభివృద్ధి చేస్తారు. ఇక కేరళలోని పాలక్కడ్‌లో కూడా స్మార్ట్‌ నిర్మిస్తామని మంత్రి వెల్లడించారు. కొప్పర్తి హబ్‌తో 54 వేల మందికి ఉపాధి లభిస్తుందని ఆయన తెలిపారు. కడప జిల్లా కొప్పర్తిలో పారిశ్రామిక హబ్‌ కింద 2,596 ఎకరాలను రూ.2,137కోట్లతో అభివృద్ధి చేస్తామని అన్నారు. ఈ హబ్‌తో 54వేల మందికి ఉపాధి లభిస్తుందని అన్నారు. అలాగే కర్నూలు జిల్లా ఓర్వకల్లులో 2,621 ఎకరాల్లో పారిశ్రామిక కారిడార్‌ను రూ.2,786కోట్లతో ఏర్పాటు చేస్తామని అన్నారు. ఈ హబ్‌ వల్ల 45వేల మందికి ఉపాధి అవకాశాలు ఉంటాయని అన్నారు.