బీకేర్ ఫుల్… ఇన్వెస్టర్లకు వార్నింగ్
ప్రపంచ మార్కెట్లకు భిన్నంగా ఇన్నాళ్ళూ బలంగా ఉన్న మన మార్కెట్లు క్రమంగా బలహీనపడుతున్నాయి. అమెరికా, యూరో మార్కెట్ల నష్టాలను ఇన్నాళ్ళూ బేఖాతరు చేస్తూ వచ్చిన మన మార్కెట్లు కూడా ఇతర మార్కెట్ల బాటలో నడవక తప్పదని ప్రముఖ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ అశ్వని గుజ్రాల్ అంటున్నారు. అమెరికాలో నాస్డాక్, ఎస్ అండ్పీ 500 సూచీలు జూన్ నెల కనిష్ఠానికి దిగువకు వచ్చే అవకాశాలు ఉన్నాయని ఆయన అన్నారు. ఈ నేపథ్యంలో మన మార్కెట్లు రోజూ గ్రీన్లో కొనసాగడం కష్టమని అన్నారు. నిఫ్టి 17600 వద్ద పుట్ రైటింగ్ సాగుతోందని.. అంటే మార్కెట్ ఈ స్థాయికి చేరే అవకాశముందని తెలిపారు. వచ్చే వారానికి కూడా నిఫ్టి 17800 వద్ద కాల్ రైటింగ్ జోరుగా ఉందని ఆయన చెప్పారు. అంటే నిఫ్టి ఈ స్థాయిని దాటి ముందుకు సాగడం కష్టమని అన్నారు. ఈ నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఎపుడూ ఒకే ఉండటం కుదరదని అన్నారు. నిఫ్టి పెరిగే పక్షంలో తమ పొజిషన్స్లో కొంత అమ్మడం బెటర్ అని ఆయన సలహా ఇచ్చారు. అలాగే నిఫ్టిని షార్ట్ చేసే అంశాన్ని కూడా పరిశీలించాలని అన్నారు. విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీయ ఇన్వెస్టర్లు కూడా క్యాష్ మార్కెట్లో షేర్లను భారీగా అమ్ముతున్నారని ఆయన చెప్పారు. కొన్నాళ్ళకైనా.. మన మార్కెట్లు ప్రపంచ మార్కెట్ల బాటలో నడవక తప్పదని అన్నారు. కాబట్టి మార్కెట్ పెరుగుతూనే ఉంటుందనే అపోహ నుంచి ఇన్వెస్టర్లు బయటకు రావాలని అన్నారు.