ఐటీ వద్దు… బ్యాంకులు ముద్దు
అమెరికాలో వడ్డీ రేట్ల పెంపు ప్రక్రియ ప్రారంభమయ్యాక చాలా మంది అనలిస్టులు బ్యాంకు షేర్లను సిఫారసు చేశారు. ముఖ్యంగా చాలా ప్రభుత్వ రంగ బ్యాంకులు ఎన్పీఏ సుడిగుండం నుంచి బయటపడటం, కరోనా తరవాత ఆర్థిక వ్యవస్థ క్రమంగా కోలుకోవడంతో… రుణాలకు మళ్ళీ డిమాండ్ పెరుగుతుందని వీరు ఊహించారు. ముఖ్యంగా నిత్యావసర సేవల విభాగాల్లో బ్యాంకింగ్ కూడా ఉంటుంది. మాంద్యం కూడా బ్యాంకు సేవలు అవసరమని, దాదాపు ప్రతి బ్యాంక్ తాను అందించే సేవలకు ఖాతాదారుల నుంచి చార్జీలు వసూలు చేస్తున్నందున.. ఇదొక మంచి లాభదాయక బిజినెస్ అని అనలిస్టులు సూచించారు. గతంలో కేవలం వడ్డీ ఆదాయంపైనే ఆధారపడిన ఈ బ్యాంక్ … ఇపుడు బ్యాంకులకు వడ్డీయేతర మరో ప్రధాన ఆదాయ వనరుగా మారింది. ఇదే సమయంలో కరోనా పుణ్యమా అని భారీగా పెరిగిన ఐటీ షేర్లలో భారీ కరెక్షన్ వచ్చింది. దీంతో విదేశీ ఇన్వెస్టర్లతో పాటు దేశీ ఇన్వెస్టర్లు కూడా ఐటీ నుంచి బ్యాంకింగ్కు షిఫ్ట్ అయ్యారు. 2021లో ఐటీ సూచీ 60 శాతం పెరగ్గా, నిఫ్టి 24 శాతం పెరిగింది. అయితే బ్యాంక్ నిఫ్టి 13 శాతమే పెరిగింది. 2022లో సీన్ మారింది. ఐటీకి ఇన్వెస్టర్లు గుడ్బై చెప్పేస్తున్నారు. ఈ ఏడాది ఇప్పటి వరకు నిఫ్టి ఐటీ సూచీ 28 శాతం క్షీణించగా… నిఫ్టి 3 శాతం పెరిగింది. కాని ఇదే సమయంలో నిఫ్టి బ్యాంక్ సూచీ 16 శాతం పెరిగింది. నిన్న ఆల్టైమ్ హైని కూడా తాకింది. గత మూడు, నాలుగేళ్ళ నుంచి నిరాశాజనక పనితీరు కనబర్చిన బ్యాంకింగ్ రంగం ఇపుడిపుడే కోలుకుంటోంది. దీంతో ఇన్వెస్టర్లు ఈ రంగానికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇప్పటి వరకు ఐటీ రంగంలో విదేశీ పోర్టుఫోలియో ఇన్వెస్టర్ల పెట్టుబడి 26 శాతం తగ్గింది. ఇదే సమయంలో బ్యాంకింగ్, ఫైనాన్షియల్ రంగంలో వీరి పెట్టుబడి 11 శాతం పెరిగింది.