For Money

Business News

ఏడాదిలో లక్షన్నర ఉద్యోగాలు

రాష్ట్ర ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల సంఖ్య బాగా పెరిగిందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ అన్నారు. దేశ వ్యాప్తంగా ఈ రంగంలో గత ఏడాది 4.5 లక్షల ఉద్యోగాలు వస్తే.. ఒక్క హైదరాబాద్‌లోనే లక్షన్నర ఉద్యోగాలు వచ్చాయని ఆయన అన్నారు. హైటెక్‌ సిటీలోని టెక్‌ మహీంద్రా కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన 2021-22 ఏడాదికి తెలంగాణ ఐటీ వార్షిక నివేదికను విడుదల చేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం నుంచి సాధించిన పురోగతిని వివరించారు. గడిచిన ఎనిమిదేళ్లలో తెలంగాణలో ఐటీలో అద్భుతమైన పురోగతి సాధించామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. కరోనా మహమ్మారి ప్రభావం ఉన్నా గతేడాది అంచనాలకు మంచి రాణించామన్నారు.
ఐటీ, అనుబంధ ఎగుమతుల్లో గతేడాది 26.14శాతం వృద్ధి సాధించినట్లు తెలిపారు. జాతీయ సగటు 17.2 శాతం కంటే 9 శాతం ఎక్కువ వృద్ధి సాధించామన్నారు. 2021-22లో ఐటీ ఎగుమతుల విలువ రూ.1,83,569 కోట్లని అన్నారు. ప్రస్తుతం తెలంగాణలో ఐటీ ఉద్యోగుల సంఖ్య 7,78,121గా ఉన్నాయని, తెలంగాణలో ఎనిమిదేళ్లలో 4.1లక్షల ఐటీ ఉద్యోగాలు వచ్చాయన్నారు. ఈ నెల 20న టీ హబ్‌ రెండో దశ ప్రారంభిస్తామని, టీ వర్క్స్‌ కొత్త ఫెసిలిటీ ఆగస్టు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు కేటీఆర్‌ ప్రకటించారు.