నంబర్ వన్ ముకేష్, తరవాత అదానీ
ఆసియాలో చైనా ధనవంతులను దాటేశారు మన అంబానీ, అదానీలు. 2021 ఏడాదికి బ్లూమ్బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ తాజా ర్యాంకింగ్ ప్రకారం తొలి రెండు స్థానాలు వీరివే. ప్రపంచ కోటీశ్వరుల జాబితాలో అంబానీ 12వ స్థానంలోఉండగా, 14వ స్థానంలో అదానీ నిలిచారు. 2021లో ముకేష్ అంబానీ సంపద కేవలం 726 కోట్ల డాలర్లు పెరిగి 8,400 కోట్ల డార్లకు చేరింది. ఇక అదానీ సంపది గత ఏడాదిలో ఏకంగా డబుల్కుపైగా పెరిగింది. 2021లో 4,320 కోట్ల డాలర్లు పెరిగి 7,700 కోట్ల డాలర్లకు చేరింది. అదానీ స్పీడు చూస్తుంటే ముకేష్ అంబానీని దాటడం పెద్ద కష్టంగా కన్పించడం లేదు.
కలిసొచ్చిన కరోనా
కరోనాల పేదలు, మధ్య తరగతి ప్రజలు ఘోరంగా దెబ్బతింటే… కోటీశ్వరులు జెట్ స్పీడ్తో మరింత ధనవంతులు అవుతున్నారు. ఇతర సాధనాల్లో కనీస వడ్డీ కూడా రాకపోవడం, స్టాక్ మార్కెట్ జోరుగా పెరిగే సరికి చాలా మంది తమ పెట్టుబడులను షేర్ మార్కెట్కు తరలిస్తున్నారు. అలాగే ఇస్తున్న లక్షల కోట్ల ఆర్థిక సాయం కంపెనీలకు వెళుతోంది. దీంతో అంబానీ, అదానీల కంపెనీల షేర్లు దౌడు తీస్తున్నారు. నిత్యావసర వస్తువుల జాబితా నుంచి వంట నూనెలు తీసేయడంతో అదానీ ఆయిల్ కంపెనీకి పట్టపగ్గాలు లేకుండా పోయింది. అదానీ గ్రూప్ షేర్లలో గ్యాస్ పైప్లైన్లు భారీగా దక్కించుకున్న అదానీ టోటల్ గ్యాస్ షేర్ ధర 335 శాతం పెరిగింది. అలాగే విద్యుత్ ప్రైవేటీకరణ కారణంగా అదానీ ట్రాన్సిమిషన్ షేర్ 264 శాతం పెరిగింది. కృష్ణపట్నం, గంగవరం పోర్టులను కొనేసిన అదానీ ఎంటర్ప్రైజెస్ షేర్ 235 శాతం పెరిగింది. ఇక అదానీ పవర్ కూడా 200 శాతం పెరగడంతో అదానీ నెట్వర్త్ భారీగా పెరిగింది. ఇక ప్రపంచ జాబితాలో అమెజాన్ బాస్ జెఫ్ బోజోస్ మళ్ళీ నంబర్ వన్ స్థానానికి చేరుకున్నారు.