For Money

Business News

ఒరాకిల్‌కు ఎస్‌ఈసీ జరిమానా

భారత్‌, టర్కీ, దుబాయ్‌లో వ్యాపార విస్తరణ నిమిత్తం కోసం ఆయా ప్రభుత్వ అధికారులకు భారీగా ముడుపులు చెల్లించిన కేసులో టెక్‌ సంస్థ ఒరాకిల్‌కు అమెరికా స్టాక్‌ మార్కెట్‌ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్‌ ఎక్స్‌చేంజ్‌ కమిషన్‌ (ఎస్‌ఈసీ) భారీ జరిమానా విధించింది. జరిమానా కింద 2.3 కోట్ల డాలర్లు (సుమారు రూ.187 కోట్లు) కట్టాలని ఆదేశించింది. ఈ మొత్తం చెల్లించేందుకు ఒరాకిల్‌ అంగీకరించింది. ఒరాకిల్‌ ఇండియా 2012లో కూడా ఇలా అక్రమ పద్ధతుల్లో ముడుపులు ఇచ్చి పట్టుబడింది. తమ వ్యాపార అవసరాల నిమిత్తం అధికారులకు లంచాలు ఇచ్చేందుకు ఏకంగా ఓ అక్రమనిధిని కంపెనీ ఏర్పాటు చేసినట్లు ఎస్‌ఈఓ తన ఆదేశంలో పేర్కొంది. దీంతో విదేశీ అవినీతి వ్యవహారాల చట్టం కింద ఒరాకిల్‌కు జరిమానా వేసింది. భారత్‌లో రైల్వే విభాగం యాజమాన్యంలోని ఓ రవాణా కంపెనీకి సాఫ్ట్‌వేర్‌ అమ్మేందుకు ఒరాకిల్‌ ఈ ముడుపులు ఇచ్చింది. ఇతర కంపెనీల నుంచి పోటీ లేకుండా ఓ సాఫ్ట్‌వేర్‌ కాంట్రాక్టు దక్కించుకునేందుకు రైల్వే శాఖ అధికారులు భారీ ఎత్తున ముడుపులు ఇచ్చింది. అసాధారణమైన రీతిలో 70 శాతం రాయితీ కూడా ఇచ్చింది. రైల్వే విభాగం యాజమాన్యంలోని రవాణా సంస్థ అధికారులకు 67,000 డాలర్లు (సుమారు రూ.54,65,000) ముడుపుగా చెల్లించేందుకు అక్రమ మార్గాల ద్వారా ‘ప్రత్యేక ఖాతా’లు ఏర్పాటు చేశారు. వాస్తవానికి ప్రభుత్వ రంగ సంస్థ అధికారుల ముడుపుల కోసం ఒరాకిల్ సంస్థ 3.3 లక్షల డాలర్లను (రూ. 2.70 కోట్లు) ఓ కంపెనీకి తరలించింది. మరో 62,000 డాలర్లు ఈ లావాదేవీలతో సంబంధం ఉన్న సేల్స్‌ ఎంప్లాయిస్‌ నియంత్రణలోని సంస్థకు చెల్లించింది. ముడుపుల కోసం ఒరాకిల్‌ ఎస్‌ఈసీ నిర్ణయాన్ని సవాల్‌ చేయకుండా మొత్తం 2.3 కోట్ల డాలర్ల జరిమానా కట్టేందుకు అంగీకరించడం గమనార్హం. సాఫ్ట్‌వేర్‌ కోసం తాము పిలిచిన టెండర్లలో ఎవరూ పాల్గొనలేదని… అందుకే తాము ఒరాకిల్‌ సాఫ్ట్‌వేర్‌ను కొనాల్సి వచ్చిందని రైల్వే రవాణా సంస్థ కోసం టెండర్లు పిలిచిన సంస్థ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది.