For Money

Business News

మస్క్‌ డీల్‌ గడువు ముగిసింది

మైక్రోబ్లాగింగ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ట్విట్టర్‌ను టేకోవర్‌ చేసేందుకు ప్రపంచ కుబేరుడు, టెస్లా సీఈవో ఎలాన్‌ మస్క్‌ ప్రకటించిన డీల్‌కు నిర్దేశిత గడువు ముగిసింది. ఈ మేరకు ట్విట్టర్‌ ఒక ప్రకటన చేస్తూ హెచ్‌ఎస్‌ఆర్‌ చట్టం కింద ఈ లావాదేవీకి తాము వేచిచూసే కాలం ముగిసిందని తెలిపింది. ట్విట్టర్‌ షేర్‌హోల్డర్ల ఆమోదం, రెగ్యులేటర్ల అనుమతులకు లోబడి ఇక ఈ డీల్‌ పూర్తికావాల్సి ఉంటుందని ట్విట్టర్‌ పేర్కొంది.
హెచ్‌ఎస్‌ఆర్‌ చట్టం ప్రకారం సమీక్ష కోరుతూ ఫెడరల్‌ ట్రేడ్‌ కమిషన్‌, యూఎస్‌ డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ జస్టిస్‌ యాంటీట్రస్ట్‌ డివిజన్లకు సంబంధిత భారీ లావాదేవీలను ఆయా పార్టీలు సమర్పించాల్సి ఉంటుంది. ట్విట్టర్‌లో ప్రధాన వాటాను 44 బిలియన్‌ డాలర్లకు కొనుగోలు చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్న మస్క్‌ తదుపరి డీల్‌ను తాత్కాలికంగా నిలుపుచేసిన సంగతి తెలిసిందే. ఫేక్‌ అకౌంట్స్‌కు సంబంధించిన సమాచారం తనకు ఇంకా అందాల్సి ఉందని మస్క్‌ అంటున్నారు. ట్విటర్‌ షేర్లు ప్రి మార్కెట్‌లో 2 శాతం పెరిగి 40.62 డాలర్ల వద్ద ట్రేడవుతున్నాయి.