టాటా మోటార్స్… ఇంకా నష్టాలే
మార్చితో ముగిసిన త్రైమాసికంలో టాటా మోటార్స్ కన్సాలిడేటెడ్ నష్టం రూ. 1032 కోట్లకు పరిమితమైంది. గత ఏడాది ఇదే కాలంలో కంపెనీ రూ. 7605 కోట్ల నికర నష్టాన్ని ప్రకటించిన విషయం తెలిసిందే. అలాగే కంపెనీ ఆదాయం కూడా 11.5 శాతం తగ్గి రూ. 78439 కోట్లకు చేరింది. రూ. 82386 కోట్ల ఆదాయంపై రూ. 12.8 కోట్ల నికర లాభాన్ని కంపెనీ ఆర్జిస్తుందని మార్కెట్ విశ్లేషకులు అంచనా వేశారు. అంటే ఈ త్రైమాసికంలో నష్టాల్లో నుంచి లాభాల్లోకి వస్తుందని ఆశించారు. అయితే ఆదాయం తగ్గడంతో పాటు కంపెనీ ఇంకా నికర నష్టాల్లోనే ఉంది. సెమి కండక్టర్స్ లేకపోవడం వల్ల జేఎల్ఆర్ ఆదాయం తగ్గింది. అలాగే ఉక్రెయిన్ యుద్ధం కారణంగా యూరప్లో ఆర్థిక ఇబ్బందులు, చైనాలో కరోనా కారణంగా కంపెనీ అమ్మకాలు తగ్గాయి. సెమికండర్టర్స్ సరఫరా పెరిగినా 2022లో వీటి కొరత కొనసాగుతుందని జేఎల్ఆర్ పేర్కొంది. పూర్తి ఏడాది కంపెనీ వద్ద 120 కోట్ల పౌండ్ల ఫ్రీ క్యాష్ తమ వద్ద ఉందని జేఎల్ఆర్ ప్రకటించింది. భారత వ్యాపారం చాలా బాగుందని టాటా మోటార్స్ పేర్కొంది. కమర్షియల్ వెహికల్స్ ఆదాయం 29 శాతం పెరగ్గా, ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు 62 శాతం పెరిగినట్లు కంపెనీ వెల్లడించింది.