For Money

Business News

జీతో డీల్‌కు సోనీ గుడ్‌బై?

జీ ఎంటర్‌టైన్‌మెంట్‌, సోని పిక్చర్స్‌ మధ్య కుదరిన విలీనం ఒప్పందం విఫలం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకుంటూ ఈనెల 20వ తేదీలోగా జీ ఎంటర్‌టైన్‌మెంట్‌కు సోనీ నోటీసు ఇవ్వనున్నట్లు బ్లూమ్‌బర్గ్‌ వార్తా సంస్థ పేర్కొంది. ఈ రెండు కంపెనీల మధ్య 2021లో రూ. 83, 000 కోట్ల విలీన డీల్‌ కుదిరిన విషయం తెలిసిందే. ఈ ఒప్పందానికి ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చేలోగానే జీ గ్రూప్‌పై పలు అవినీతి ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా పునీత్‌ గోయెంకా, సుభాష్‌ చంద్రలు జీ గ్రూప్‌ కంపెనీల నుంచి తమ సొంత కంపెనీలకు నిధులు మళ్ళించారన్న వార్తలు రావడం.. దానిపై దర్యాప్తు సంస్థలు చర్యలు తీసుకోవడంతో సోని అసంతృప్తితో ఉంది. ఇలాంటి ఆరోపణలు వచ్చిన తరవాత కూడా తాను జీ-సోనీ విలీన సంస్థలో కీలక పాత్రలో ఉండాలని పునీత్‌ గోయెంకా డిమాండ్‌ పట్ల కూడా సోనీ సంతృప్తి లేదని తెలుస్తోంది. ఈనేపథ్యంలో ఈ విలీన ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని సోనీ నిర్ణయించినట్లు సమాచారం అందుతోంది.