అంచనాలు తప్పిన ఏషియన్ పెయింట్స్
జనవరి – మార్చి త్రైమాసికానికి ఏషియన్ పెయింట్స్ పనితీరు మార్కెట్ అంచనాలను అందుకోలేకపోయింది. ఈ త్రైమాసికంలో కంపెనీ రూ. 923 కోట్ల నికర లాభం ఆర్జిస్తుందని మార్కెట్ వర్గాల అంచనా. అయితే రూ.874.05 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని కంపెనీ ప్రకటించింది. 2020-21 ఇదే త్రైమాసిక లాభం రూ .869.89 కోట్లతో పోలిస్తే దాదాపు స్థిరంగా ఉందనే చెప్పాలి. శ్రీలంక వ్యాపారం వల్ల రూ. 115.70 కోట్ల అసాధారణ నష్టంతో పాటుప్రభుత్వం నుంచి అందాల్సిన సబ్సిడి రావడంలో జాప్యం కారణంగా కంపెనీ నికర లాభం తక్కువగా ఉన్నట్లు కంపెనీ పేర్కొంది. ఇక కంపెనీ దాయం ఆదాయం రూ .6.541.94 కోట్ల నుంచి 20.60 శాతం పెరిగి రూ.7,889.94 కోట్లకు చేరింది . మొత్తం వ్యయం రూ .5,576.38 కోట్ల నుంచి రూ .6,677.11 కోట్లకు పెరిగింది. రూ.1 ముఖ విలువ గల ఒక్కో షేరుకు రూ .15.50 ( 1550 % ) తుది డివిడెండును కంపెనీ డైరెక్టర్ల బోర్డు సిఫారసు చేసింది . అక్టోబరులో ప్రకటించిన రూ.3.65 మధ్యంతర డివిడెండుతో కలిపితే , గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద రూ.19.15 డివిడెండు ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. కంపెనీ ఫలితాలు నిరాశకల్గించినా.. అంతర్జాతీయ మార్కెట్లో క్రూడ్ ధరలు తగ్గిన నేపథ్యంలో కంపెనీ షేర్ ఇవాళ గ్రీన్లో ఉంటుందేమో చూడాలి.