For Money

Business News

పరిశ్రమలకు విద్యుత్‌ కోత కొనసాగింపు

ఏపీలో పరిశ్రమలకు వారంలో రెండు రోజుల పవర్ హాలిడేను కొనసాగిస్తున్నట్టు అధికారులు సీఎం జగన్‌కు వివరించారు. తద్వారా విద్యుత్ వినియోగాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని స్పష్టం చేశారు.గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా చూడాల్సిందిగా అధికారులకు సీఎం సూచనలు చేయగా.. అధికారులు తాము తీసుకుంటున్న చర్యలను సీఎంకు వివరించారు. తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో విద్యుత్ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలోని విద్యుత్ డిమాండ్ సహా, పీక్ డిమాండ్ సమయాల్లో బహిరంగ మార్కెట్ నుంచి కొనుగోళ్లు తదితర అంశాలపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్ధ్యాలను జోడించాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో విద్యుత్ కొరతను నివారించేందుకు తక్షణం ఏపీలోని థర్మల్ విద్యుత్ కేంద్రాల్లో అదనపు సామర్ధ్యాలను జోడించాలని అధికారులను ఆదేశించారు. వీటీపీఎస్​తోపాటు కృష్ణపట్నం యూనిట్లలో 800 మెగావాట్ల చొప్పున అదనపు యూనిట్లను వీలైనంత త్వరగా ప్రారంభించేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా సూచించారు. ఈ సమీక్షకు ఆ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఏపీజెన్‌కో ఎండీ బి శ్రీధర్, ఎన్‌ఆర్‌ఈడీసీఏపీ ఎండీ ఎన్‌ వి రమణారెడ్డి ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.