బ్లూమ్బర్గ్ కథనం తప్పు… పేటీఎం
చైనా కంపెనీలకు తాను డేటాను బదిలీ చేసినట్లు బ్లూమ్బర్గ్ వార్త సంస్థ రాసిన కథనాన్ని పేటీఎం ఖండించింది. అది కేవలం సంచలనం కోసం రాసిన కథనమని, తప్పుడు సమాచారమని పేటీఎం ఓ పత్రికా ప్రకటనలో పేర్కొంది. పేటీఎం పూర్తిగా దేశీయంగా అభివృద్ధి చెందిన సంస్థ అని తెలిపింది. డేటా లొకేషన్కు సంబంధించి ఆర్బీఐ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు తెలిపింది. పేటీఎం పేమెంట్ బ్యాంక్ మొత్తం డేటా భారత్లోనే ఉందని స్పష్టం చేసింది. మరోవైపు తన కస్టమర్ల KYC డేటాను సేకరించడంలో పేటీఎం పేమెంట్ బ్యాంక్ విఫలమైందని ఆర్బీఐ పేర్కొంది. ఇలాంటి లోపాలను తాము గతంలో కూడా గుర్తు చేశామని పేర్కొంది. దీనికి స్పందించిన పేటీఎం… ఆ లోపాలను సరిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొంది. ఆడిట్ కోసం కొన్ని సంస్థల పేర్లను ఆర్బీఐకి పేటీఎం సిఫారసు చేయనుంది. ఆడిటర్ను ఎంపిక చేసిన తరవాత పేటీఎం పేమెంట్ ఖాతాల ఆడిటింగ్ ప్రారంభం కానుంది. అన్ని ఇబ్బందులను ఎదుర్కొని… స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ కోసం దరఖాస్తు చేసే సమయంలో ఇలాంటి పరిణామాలు చోటు చేసుకోవడం… పేటీఎం ఇన్వెస్టర్లను షాక్కు గురి చేశాయి.