క్యాష్ తీయాలంటే ఓటీపీ తప్పదు
ఏటీఎం లావాదేవీల్లో అవకతవకలకు నివారించేందుకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది. ఇక నుంచి ఎస్బీఐ ఏటీఎంల్లో నగదు విత్డ్రా చేయాలంటే కస్టమర్లు ఓటీపీని ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎస్బీఐ ఏటీఎంల్లో ఒక లావాదేవీలో రూ 10,000 అంతకుమించి నగదు విత్డ్రా చేసే వారికి ఈ నిబంధన వర్తిస్తుంది. బ్యాంక్ మోసాలు పెరుగుతున్న నేపథ్యంలో ముందుజాగ్రత్త చర్యగా బ్యాంక్ కొత్త నిబంధన అమల్లోకి తెచ్చింది. క్యాష్ విత్డ్రాయల్ చేసే సమయంలో ఏ మొబైల్ నంబర్తో కార్డును రిజిస్టర్ చేశారో…ఆ మొబైల్ ఫోన్కు నాలుగంకెలతో కూడిన సిస్టమ్ జనరేటెడ్ ఓటీపీ వస్తుందని, ఇది ఒక ట్రాన్సక్షన్కు మాత్రమే వర్తిస్తుందని బ్యాంక్ తెలిపింది. ఎస్బీఐ ఏటీఎంలన్నింటిలోనూ ఓటీపీ ఆధారిత నగదు విత్డ్రాయల్ సిస్టమ్ను అమలు చేసేలా టెక్నికల్గా మార్పులు చేసింది.