కోలుకున్నా… నష్టాల్లోనే నిఫ్టి
అంతర్జాతీయ మార్కెట్లో వస్తున్న అమ్మకాల ఒత్తిడి కారణంగా అనేక దేశాల సూచీలు నష్టాల్లో ఉన్నాయి. ఉదయం నుంచి ఆసియా దేశాలన్నీ నష్టాల్లో ఉన్నాయి. జపాన్ నిక్కీ మినహా మిగిలిన దేశాల సూచీలు ఒక శాతం నుంచి 2 శాతం దాకా నష్టపోయాయి. యూఎస్ ఫ్యూచర్స్ నష్టాల్లో ఉండటంతో మన నిఫ్టి కూడా నష్టాల్లోనే ప్రారంభమైంది. దిగువ స్థాయిలో మద్దతు అందడంతో కోలుకుని 16165 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నష్టం 55 పాయింట్లు. యూరో మార్కెట్లు కూడా ఒక శాతం మేర నష్టాలతో ప్రారంభమయ్యాయి. మరి ఈ స్థాయి ఒత్తిడి కొనసాగుతుందా లేదా నష్టాల నుంచి ఈ మార్కెట్లు కోలుకుంటాయా అన్నది చూడాలి. మన మార్కెట్లలో మాత్రం భారీ నష్టాలు లేకున్నా… లాభాలు కూడా ఉండకపోవచ్చని తెలుస్తోంది. ఉదయం నుంచి ఓఎన్జీసీ, డాక్టర్ రెడ్డీస్ టాప్ గెయినర్స్గా కొనసాగుతున్నాయి. అలాగే భారతీ ఎయిర్టెల్ టాప్ లూజర్గా నిలిచింది. అయితే టీసీఎస్ ఫలితాలు మార్కెట్ను తీవ్ర నిరాశకు గురి చేశాయి. దాదాపు మొత్తం ఐటీ షేర్లలో భారీ అమ్మకాల ఒత్తిడి వస్తోంది. బ్లూచిప్స్తో పాటు మిడ్ క్యాప్ ఐటీ షేర్లు కూడా భారీగా నష్టపోయాయి. నిఫ్టి టాప్ లూజర్స్లో భారతీ ఎయిర్టెల్ మినహా… మిగిలిన నాలుగూ ఐటీ షేర్లే.