For Money

Business News

కీలక స్థాయి 16900 పాయే

నిఫ్టి భారీ నష్టాలతో ప్రారంభమైంది. ఓపెనింగ్‌లోనే నిఫ్టి16854ని తాకింది. అంటే 200 రోజుల చలన సగటును నిఫ్టి బ్రే్క్‌ చేసింది. ఈ స్థాయి నుంచి నిఫ్టి గనుక మరింత క్షీణించే పక్షంలో… అమ్మకాల ఒత్తిడి పెరిగే అవకాశముంది. నిఫ్టి ప్రస్తుతం 16871 వద్ద ట్రేడవుతోంది. క్రితం ముగింపుతో పోలిస్తే నిఫ్టి 136 పాయింట్ల నష్టంతో ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 500 పాయింట్లు నష్టపోయింది. నిఫ్టితో పోలిస్తే నిఫ్టి బ్యాంక్‌ మాత్రమే భారీ నష్టాల్లో ఉంది. మరోలా చెప్పాలంటే బ్యాంక్‌ షేర్లు నిఫ్టిని దెబ్బతీస్తున్నాయి. నిఫ్టి నెక్ట్స్‌ మాత్రం 0.75 శాతం, నిఫ్టి మిడ్‌ క్యాప్‌ సూచీ మాత్రం కేవలం 0.33 శాతం నష్టంతో ఉంది. మున్ముందు ఈ సూచీలు ఎలా రియాక్టవుతాయో చూడాలి. ఎందుకంటే రేపు వీక్లీ, మంత్లి డెరివేటివ్స్‌ క్లోజింగ్‌ కాగా, ఎల్లుండి ఆర్బీఐ వడ్డీ రేట్లను పెంచనుంది. ఈ నేపథ్యంలో నిఫ్టి భారీ హెచ్చుతగ్గులకు లోను కావడం ఖాయంగా కన్పిస్తోంది. ఇక షేర్ల విషయానికొస్తే నిఫ్టిలో 44 షేర్లు నష్టాల్లో ఉన్నాయి. లాభాల్లో ఉన్నవాటిలో డాక్టర్‌ రెడ్డీస్‌ ల్యాబ్, సన్‌ ఫార్మా, సిప్లా షేర్లు నిఫ్టి టాప్‌ గెయినర్స్‌గా నిలిచాయి. నిఫ్టి టాప్‌ లూజర్స్‌లో హెచ్‌డీఎఫ్‌సీ ట్విన్స్‌ ఉన్నాయి. అయితే టేకోవర్‌ కారణంగా టొరెంట్‌ ఫార్మా షేర్‌ 5 శాతం క్షీణించింది. అదానీ గ్రూప్‌ షేర్లలో ఒత్తిడి కన్పిస్తోంది.