For Money

Business News

అనిల్‌ వద్ద రూ.800 కోట్ల అక్రమాస్తులు!

ప్రముఖ పారిశ్రామిక వేత్త అనిల్ అంబానీకి చెందిన వివిధ కంపెనీల పేరున విదేశాల్లో రూ.800 కోట్ల అక్రమాస్తులు ఉన్నట్లు ఆదాయపు పన్ను శాఖ తేల్చింది. ఇవి పెట్టుబడులు, ఆస్తులు రూపంలో ఉన్నట్లు ఇన్‌కమ్‌ ట్యాక్స్‌ ఇన్వెస్టిగేషన్‌ వింగ్‌ ముంబై యూనిట్‌ గుర్తించింది. అనిల్ అంబానీపై బ్లాక్ మనీ యాక్ట్(BMA) ప్రయోగిస్తూ ఈ విభాగం ఆదేశాలు జారీ చేసింది. ‘ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్(ఎఫ్‌టీటీఆర్)’ ముంబై విభాగం మార్చి 2022లో ఈ ఆదేశాలను జారీ చేసింది. రూ.800 కోట్ల లావాదేవీలతో ముడిపడిన విదేశీ బ్యాంక్ అకౌంట్లు, విదేశీ కంపెనీలు, లావాదేవీల వివరాలను ఇందులో వెల్లడించింది. వాస్తవానికి రూ.800 కోట్ల విదేశీ ఆస్తులను 2019లోనే గుర్తించారు. వీటికి సంబంధించి మార్చి 2022లో నల్లధన చట్టం ఆదేశాలు జారీ అయ్యాయి. ఈఆస్తుల గురించి ఐటీ విభాగం అడిగిన ప్రశ్నలకు అనిల్ అంబానీ కంపెనీ నుంచి సమాధానం రాలేదని తెలుస్తోంది. తన గ్రూప్ దివాళా తీసినట్టు 2020లో యూకే కోర్టుకు అనిల్ అంబానీ వెల్లడించారు. తన నికర ఆస్తుల విలువ సున్నాగా పేర్కొన్నారు. 3 చైనా బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాల చెల్లింపుల విషయంలో అనిల్ అంబానీ ఈ సమాధానమిచ్చారు.
బహమాస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్ దేశాల్లో ఉన్న విదేశీ కంపెనీల అంతిమ లబ్దిదారు అనిల్ అంబానీయేనని ఆదాయ పన్నుశాఖ పేర్కొంది. బహమస్‌లో డైమండ్ ట్రస్ట్‌ను 2006లో స్థాపించారని వివరించింది. డ్రీమ్‌వర్క్ హోల్డింగ్ కంపెనీ సహకారంతో దీనిని ఏర్పాటు చేశారు. ఇందుకు సంబంధించి బహమాస్ ప్రభుత్వం నుంచి సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్(సీబీడీటీ) విభాగం ఫారెన్ ట్యాక్స్ అండ్ ట్యాక్స్ రీసెర్చ్(ఎఫ్‌టీటీఆర్)కి సమాచారం అందిందని వెల్లడించింది. ఈ సమాచారంలో స్విస్ బ్యాంక్ అకౌంట్ కూడా ఉంది. జ్యూరిచ్‌లోని యూబీఎస్ బ్యాంక్ బ్రాంచ్‌లో ఈ ఖాతా ఉందని చెప్పారు. 2010లో మరో కంపెనీని స్థాపించారని రిపోర్ట్ పేర్కొంది.