For Money

Business News

ఇదొక గోల్‌మాల్‌ బడ్జెట్‌

కేంద్ర బడ్జెట్ తీవ్ర నిరాశ, నిస్పృహకు గురి చేసిందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆరోపించారు. దశ, దిశ, నిర్దేశం లేని… పసలేని నిష్ప్రయోజనకర బడ్జెట్ ఇది అని సీఎం కేసీఆర్ మండిపడ్డారు. కేంద్రం ప్రవేశ పెట్టిన బడ్జెట్ ఎస్సీ, ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలకు, దేశ రైతాంగానికి, సామాన్యులకు, పేదలకు, వృత్తి కులాలకు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ నిస్పృహలకు గురిచేసిందని ఆయన ఒక ప్రకటనలో విమర్శించారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ చదివి వినిపించిన బడ్జెట్ ప్రసంగం ఆసాంతం డొల్లతనంతో నిండిన మాటలగారడీతో కూడినదని సీఎం అన్నారు.
కేంద్ర ప్రభుత్వం తమ జబ్బలు తామే చరుచుకుంటూ, సామాన్యులను నిరాశా నిస్పృహలకు గురిచేస్తూ. మసిపూసి మారేడు కాయ చేసిన గోల్ మాల్ బడ్జెట్ ఇదని కేసీఆర్‌ అన్నారు. వ్యవసాయ రంగాన్ని ఆదుకునే దిశగా కేంద్రం తీసుకున్న చర్యలు శూన్యమన్నారు. దేశ రైతాంగానికి వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్‌ బిగ్ జీరో అని సీఎం స్పష్టం చేశారు. దేశ చేనేత రంగానికి ఈ బడ్జెట్ సున్నా చుట్టిందని కేసీఆర్ పేర్కొన్నారు . నేతన్నలను ఆదుకునేందుకు ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఉద్యోగులను చిరు వ్యాపారులను బడ్జెట్ తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. ఇన్‌ ట్యాక్స్ స్లాబ్స్ మార్చకపోవడం విచారకరమని సీఎం అన్నారు . ఆదాయపన్ను చెల్లింపులో స్లాబుల విధానం కోసం ఆశగా ఎదురు చూస్తున్న ఉద్యోగ వర్గాలు, తదితర పన్ను చెల్లింపుదారులు చకోర పక్షుల్లా ఎదురు చూసారని, వారి ఆశలమీద కేంద్ర బడ్జెట్ నీళ్లు చల్లిందన్నారు. వైద్యం తదితర ప్రజారోగ్యం , మౌలిక రంగాలను అభివృద్ధి పరచడంలో కేంద్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని కేసీఆర్‌ ఆరోపించారు.