For Money

Business News

సంక్షోభంలో బ్రిటన్‌ ప్రభుత్వం

బ్రిటన్‌లో రాజకీయ సంక్షోభం తలెత్తింది. ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ ప్రభుత్వంలోని ఇద్దరు సీనియర్‌ మంత్రులు షాకిచ్చారు. భారత మూలాలున్న ఆర్థిక మంత్రి రిషి సునక్‌తో పాటు పాక్‌ మూలాలున్న ఆరోగ్య శాఖ మంత్రి సాజిద్‌ జావిద్‌ తమ పదవులకు రాజీనామా చేశారు. పార్టీ గేట్‌ మొదలుకుని పలు ఆరోపణలు, సమస్యలతో అల్లాడుతున్న జాన్సన్‌ ప్రభుత్వం తాజా పరిణామాలతో కుప్పకూలే ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది.

ప్రభుత్వం నుంచి వైదొల‌గ‌డం బాధాక‌రంగా ఉందని రిషి సునాక్ త‌న లేఖ‌లో పేర్కొన్నారు. కానీ, ప్రస్తుతం ఉన్న ప‌రిస్థితుల్లో కొన‌సాగ‌డం క‌ష్ట సాధ్యమని ఆయన తెలిపారు. ప్రభుత్వం నుంచి ప్రజ‌లు స‌రైన పాల‌నను, సమర్థవంతమైన పాలనను.. సీరియస్‌ పాలనను కోరుకుంటారని ఆయన అన్నారు. ఇదే తన చివరి మంత్రి పదవిగా ఆయన లేఖలో పేర్కొన్నారు. పాలనలో ప్రమాణాల కోసం పోరాడటంలో తనకు విశ్వాసం ఉందని ఆయన అన్నారు. ఒకానొక ద‌శ‌లో బోరిస్ జాన్సన్‌కు ప్రత్యామ్నాయంగా బ్రిట‌న్ ప్రధాని రిషి సునాక్ అవుతార‌ని వార్తలొచ్చాయి. కాని ఆయన రాజీనామా పత్రం చూస్తుంటే ఇక తాను మంత్రిగా చేయనని అన్నట్లు ఉంది.