For Money

Business News

హీరో ధరలు రూ.3,000 వరకు పెంపు

హీరో మోటోకార్ప్‌ తమ వాహనాల ధరలను రూ.3,000 వరకు పెంచనున్నట్లు వెల్లడించింది. పెరిగిన ధరలు ఈ నెల 20 నుంచి అమల్లోకి వస్తాయని కంపెనీ పేర్కొంది. ముడి పదార్థాలు, కమొడిటీ ధరలు పెరిగిన నేపథ్యంలోనే వాహనాల ధరలు పెంచాల్సి వచ్చిందని కంపెనీ తెలిపింది. అన్ని మోడళ్ల మోటార్‌సైకిళ్లు, స్కూటర్లపై రూ.3,000 వరకు ధర పెంచుతామని ప్రకటించిన కంపెనీ, ఏ మోడల్‌కు ఎంత పెంచేదీ వెల్లడించలేదు. మోడల్‌, మార్కెట్‌ ఆధారంగా పెంపు ఉంటుందని తెలిపింది. గత జనవరిలో రూ.1,500 వరకు, ఏప్రిల్‌లో రూ.2,500 వరకు కంపెనీ వాహనాల ధరలు పెంచిన సంగతి తెలిసిందే. డిమాండ్‌ అంతంత మాత్రమే ఉన్నా… వాహనాల ధరలను కంపెనీలు పెంచక తప్పడం లేదు. ముఖ్యంగా కమాడిటీస్‌ ధరలు భారీగా పెరగడంతో కంపెనీలకు ధరలు పెంచడంతో తప్ప మరో గత్యంతరం లేని పరిస్థితి ఏర్పడిందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి.