For Money

Business News

అదానీలోకి మరో వంద కోట్ల డాలర్లు

అదానీ గ్రూప్‌ను అమెరికా ఈక్విటీ ఇన్వెస్ట్‌మెంట్‌ సంస్థ జీక్యూజీ పార్టనర్స్‌ మరో సారి ఆదుకుంది. ఈసారి కూడా వంద కోట్ల డాలర్ల పెట్టుబడి పెట్టింది. హిండెన్‌బర్గ్‌ నివేదిక వెలువడిన అనంతరం అదానీ గ్రూప్‌ షేర్లు కుప్ప కూలిన సమయంలో వంద కోట్ల డాలర్ల విలువైన అదానీ షేర్లను జీక్యూజీ కొనుగోలు చేసింది. ఇపుడు అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ లిమిటెడ్‌, అదానీ గ్రీన్‌ ఎనర్జీలో దాదాపు వంద కోట్ల డాలర్ల విలువైన షేర్లను జీక్యూజీ పార్టనర్స్‌ కొనుగోలు చేసింది. ఈ కంపెనీత పాటు పలువురు ఇతర ఇన్వెస్టర్లు కూడా పెట్టుబడి పెట్టినట్లు తెలుస్తోంది. అదానీ కుటుంబానికి చెందిన షేర్లను ఈ కంపెనీలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. అదానీ ఎంటర్‌ ప్రైజెస్‌కు చెందిన 1.8 కోట్ల షేర్లు బుధవారం బ్లాక్‌డీల్‌ ద్వారా చేతులు మారాయి. అలాగే అదానీ గ్రీన్‌ ఎనర్జీకి చెందిన 3.52 కోట్ల షేర్లను ఇన్వెస్టర్లు కొనుగోలు చేశారు. దీంతో ఆరు శాతంపైగా లాభంతో అదానీ ఎటర్‌ప్రైజెస్‌ షేర్‌ రూ.2,300 వద్ద ముగిసింది. అయితే అదానీ గ్రీన్‌ ఎనర్జీ షేర్‌ మాత్రం దాదాపు క్రితం స్థాయి రూ.920 వద్దే ముగిసింది. జీక్యూజీ పార్ట్‌నర్స్‌ను భారత సంతతికి చెందిన రాజీవ్‌ జైన్‌ 2016 జూన్‌లో స్థాపించారు. ప్రస్తుతం ఆయన ఈ కంపెనీకి ఛైర్మన్‌, చీఫ్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఆఫీసర్‌గా వ్యవహరిస్తున్నారు.