For Money

Business News

భారీగా తగ్గిన బంగారం డిమాండ్‌..

రష్యా-ఉక్రెయిన్‌ మధ్య యుద్ధం నేపథ్యంలో భారీగా పెరిగిన బంగారం ధరలు తగ్గుముఖం పట్టాయి. ఈ ఏడాదిలో జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో పసిడి ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠ స్థాయికి చేరాయి. పసిడి డిమాండ్‌ తగ్గడానికి ఇదే కారణమని అంటున్నారు. జనవరి నుంచి మార్చి మధ్యకాలంలో మనదేశంలో పసిడి డిమాండ్‌ 18శాతం క్షీణించి 135.5టన్నులకు తగ్గింది. 2021 జనవరి-మార్చి త్రైమాసికంలో 165.8టన్నులుగా నమోదైంది. ఈ వివరాలను వరల్డ్‌ గోల్డ్‌ కౌన్సిల్‌ (డబ్ల్యూజీసీ) తెలిపింది. బంగారం డిమాండ్‌ 12 శాతం తగ్గిందని బులియన్‌ వర్గాలు తెలిపాయి. 2022లో మొదటి మూడు నెలలకాలంలో రూ.61,550 కోట్ల బంగారం విక్రయించంగా, 2021లో అదేకాలానికి రూ.69,720కోట్లు విలువచేసే పసిడిని విక్రయించారు. కాగా ఆభరణాలు 26శాతం డిమాండ్‌ తగ్గి 94.2 టన్నులకు పడిపోయింది. గత త్రైమాసికంలో బంగారంలో పెట్టుబడులు 2021మొదటి త్రైమాసికంలో పోలిస్తే 5శాతం పెరగడం విశేషం.ధరల పెరుగుదలతోపాటు ఉక్రెయిన్‌-రష్యా యుద్ధం కారణంగా ఈక్విటీ మార్కెట్లో నెలకొన్న అస్థిరత, రూపాయి క్షీణత కారణంగా సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారం పెట్టుబడులకు మదుపర్లు ఆసక్తి చూపారు. మొదటి త్రైమాసికంలో బంగారు ఆభరణాల డిమాండ్‌ 100టన్నుల కంటే తక్కువగా ఉండటం 2010తర్వాత మళ్లి ఇప్పుడే కావడం గమనార్హం.