For Money

Business News

మీ వల్ల కాకపోతే.. ఆ భూములు మాకిచ్చేయండి

 

కేంద్ర ప్రభుత్వం గతంలో కంపెనీలు ప్రారంభించేందుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భూములు ఇచ్చిందని… ఇపుడు వాటిని అమ్మడానికి కేంద్ర ప్రయత్నిస్తోందని ఆ రాష్ట్ర మంత్రి కేటీఆర్‌ అన్నారు. ఖాయిలా పడిన సంస్థలను పునరుద్ధరించాలని.. లేదా ఆ స్థాలాల్లో కొత్త సంస్థలు ప్రారంభించాలని ఆయన అన్నారు. లేకుంటే కేంద్ర ప్రభుత్వం సదరు భూములను రాష్ట్ర ప్రభుత్వానికి వెనక్కి ఇచ్చేయాలని ఆయన డిమాండ్‌ చేశారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు ఆయన లేఖ రాశారు.
అమ్మడం కుదరదు
కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం కేటాయించిన భూముల‌ విలువ సుమారు రూ. 40వేల కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని కేటీఆర్ పేర్కొన్నారు. హిందుస్తాన్ కేబుల్స్ లిమిటెడ్‌ (HCL), హిందుస్థాన్ ఫ్లోరో కార్బన్స్ లిమిటెడ్(HFCL), ఇండియన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్స్ లిమిటెడ్ (IDPL), హెచ్ఎంటీ (HMT), సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (CCI) ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను మోడీ ప్రభుత్వం తన డిజిన్వెస్ట్మెంట్ ప్రణాళికల్లో భాగంగా అమ్ముతోందని కేటీఆర్ తెలిపారు. ఈ ఆరు సంస్థల‌కు గతంలో సూమారు 7,200 ఎకరాల భూమిని రాష్ట్ర స‌ర్కారు కేటాయించిన‌ట్లు వెల్లడించారు. ప్రభుత్వ ధరల ప్రకారం ఈ భూముల విలువ ఉంటుంద‌ని కనీసం రూ. 5వేల కోట్లకు పైగా ఉందని, బహిరంగ మార్కెట్ ధరల ప్రకారం రూ. 40వేల కోట్లు ఉంటుంద‌ని ఆయ‌న పేర్కొన్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ నిర్ణయాన్ని వెంట‌నే వెనక్కి తీసుకోవాలని కోరారు. కేంద్రం అడుగుతోంది…
హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా కోసం చేపట్టే స్కైవేలాంటి ప్రజోపయోగ ప్రాజెక్టులకు భూములు అడిగితే మార్కెట్ ధరల ప్రకారం పరిహారం చెల్లించాలని డిమాండ్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వానికి.. రాష్ట్ర స‌ర్కారు ఇచ్చిన భూములను అమ్మే హక్కు ఎక్కడుందని మంత్రి కేటీఆర్ ప్ర‌శ్నించారు. ప్రభుత్వ రంగ సంస్థల అమ్మకం విషయంలో కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు రాష్ట్ర ప్రభుత్వాల హక్కులను కాల‌రాస్తున్నట్లు ఉంద‌ని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ప్రజల ఆత్మగౌరవానికి ఒకప్పుడు చిహ్నంలా నిలిచిన ఎన్నో ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం చౌకగా అమ్మేస్తోందని మండిపడ్డారు.