రూ. 50,000 దిగువకు స్టాండర్డ్ బంగారం?
చాలా రోజుల తరవాత స్టాండర్డ్ బంగారం రూ.50,000 దిగువకు రానుంది. అంతర్జాతీయ మార్కెట్లలో భారీ అమ్మకాల ఒత్తిడి, డాలర్ బలపడటంతో మన మార్కెట్లో బంగారంపై ఒత్తిడి తీవ్రంగా ఉంది. నిన్న రాత్రి ఫ్యూచర్స్ మార్కెట్లో పది గ్రాముల స్టాండర్డ్ బంగారం ధర రూ.1041 తగ్గి రూ. 50,660 వద్ద ముగిసింది. అలాగే కిలో వెండి కూడా రూ. 1620 తగ్గి రూ. 60,309కి పడింది. ఇవాళ కూడా అంతర్జాతీయ మార్కెట్లో బులియన్ ధరలు తగ్గాయి. వెండి 0.65 శాతం, బంగారం 0.32 శాతం నష్టంతో ట్రేడవుతున్నాయి. మరోవైపు డాలర్ ఇండెక్స్ ఇవాళ 105ని దాటడంతో రూపాయి మరింత బలహీనపడే అవకాశముంది. దీంతో బులియన్ మార్కెట్లో ఫ్యూచర్స్తో పాటు స్పాట్ మార్కెట్ ఇవాళ ఒత్తిడి అధికంగా ఉంటుందని అంటున్నారు. పైగా ఫెడ్ నిర్ణయం తరవాత ఈక్విటీ, కరెన్సీ, బులియన్ మార్కెట్లో హెచ్చుతగ్గులు ఉంటాయని విశ్లేషకులు చెబుతున్నారు. మార్కెట్ నిలదొక్కుకునేంత వరకు కొనుగోళ్ళ జోలికి వెళ్ళొద్దని అంటున్నారు. ఫెడ్ అరశాతం మేర వడ్డీ పెంచితే … మార్కెట్లు కోలుకునే అవకాశముంది. లేకుంటే మరింత ఒత్తిడి ఖాయమని అంటున్నారు.