For Money

Business News

బడ్జెట్‌లో అంబానీ, అదానీలకు బూస్ట్‌

నిన్నటి బడ్జెట్‌ను కార్పొరేట్‌ బడ్జెట్‌గా కాంగ్రెస్‌ అభివర్ణించింది.ముఖ్యంగా బడదా పారిశ్రామికవేత్తలకు అనేక రాయితీలు ఇచ్చింది. అందులో డేటా సెంటర్లకు సంబంధించి కేంద్రం చేసిన ప్రతిపాదనలతో అంబానీ, అదానీ కంపెనీలు భారీగా లబ్ది కల్గనుంది. డేటా సెంటర్లు, ఎనర్జీ స్టోరేజీతో పాటు ఎలక్ట్రిక్‌ చార్జింగ్‌ ఇన్‌ఫ్రా, గ్రిడ్‌ స్కేల్‌ బ్యాటరీ సిస్టమ్స్‌ వంటి ఆధునిక సదుపాయాలకు సైతం మౌలిక హోదా కల్పిస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బడ్జెట్లో ప్రకటించారు. దీంతో ఈ సదుపాయాల ఏర్పాటుకు బ్యాంకుల నుంచి కారు చౌకగా రుణాలు లభిస్తాయి. దీనివల్ల ముకేష్‌ అంబానీ, గౌతమ్‌ అదానీ, సునీల్‌ మిట్టల్‌ వంటి కార్పొరేట్‌ దిగ్గజాలకు భారీగా లబ్ది చేకూర్చనుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే, ఈ విభాగాల్లో అదానీ, మిట్టల్‌, అంబానీలు ఇప్పటికే భారీ ప్రణాళికలు ప్రకటించారు.
విదేశీ రుణాల సేకరణ, తక్కువ వడ్డీకే దీర్ఘకాలిక రుణాల సేకరణతో పాటు విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను సైతం ఆకర్షించేందుకు డేటా సెంటర్లకు ఇన్‌ఫ్రా హోదా దోహదపడనుందని హైదరాబాద్‌కు చెందిన డేటా సెంటర్ల నిర్వహణ సంస్థ కంట్రోల్‌ఎస్‌ వ్యవస్థాపకులు, సీఈఓ శ్రీధర్‌ పిన్నపురెడ్డి అన్నారు. అదానీ గ్రూప్‌ తొలుత ముంబై, చెన్నై, హైదరాబాద్‌, ఢిల్లీలో డేటా సెంటర్లను ఏర్పాటుకు రంగం సిద్ధం చేసుకుంటోంది. ఇక భారతీ ఎయిర్‌టెల్‌ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2025 నాటికి గ్రూప్‌ డేటా సెంటర్ల సామర్థ్యాన్ని మూడింతలకు పెంచేందుకు రూ.5,000 కోట్లు పెట్టుబడిగా పెట్టనున్నట్లు తెలిపింది. ఇక ముకేష్‌ అంబానీకి చెందిన డిజిటల్‌ సేవల విభాగమైన జియో ప్లాట్‌ఫామ్‌ కూడా డేటా సెంటర్ల ఏర్పాటుపై దృష్టిసారించింది. 7,600 కోట్ల డాలర్లతో గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో రియలన్స్‌ ఎనర్జీ స్టోరేజీ సహా నాలుగు గిగా ఫ్యాక్టరీలను ఏర్పాటు చేయబోతోంది. వీటికయ్యే భారీ పెట్టుబడుల కోసం చౌకగా రుణాలు పొందేందుకు మౌలిక హోదా దోహదపడనుంది.